సినిమా టికెట్ల ధరలు, ఇండస్ట్రీకి సంబంధించి ఇతర సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 10న సీఎం జగన్తో టాలీవుడ్ పెద్దలు సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హీరోలు నాగార్జున, మహేశ్బాబు, నిర్మాతలు దానయ్య, వంశీ తదితరులు జగన్తో భేటీ అయ్యేవారిలో ఉన్నట్టు వార్తలొచ్చాయి.
గత నెలలో సీఎంతో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే లంచ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీపై ఎల్లో మీడియా విష ప్రచారం చేయడం తెలిసిందే. సినిమా టికెట్లపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఈ నివేదిక సీఎం జగన్ చెంతకు చేరింది. మరోవైపు సినీ ప్రముఖులతో మెగాస్టార్ చిరంజీవి చర్చించారు. సీఎంతో చర్చించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
టాలీవుడ్ ఏం కోరుకుంటుంది? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో మరోసారి సీఎం సమక్షంలో ఇరుపక్షాల పెద్దలు కీలక సమావేశం జరపనున్నారు. ఈ భేటీ కంటే ప్రధానంగా జగన్తో జూనియర్ ఎన్టీఆర్ సమావేశమవుతారనే వార్తే సంచలనం కలిగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్పై గత కొంత కాలంగా టీడీపీ, ఎల్లో మీడియా ఓ పథకం ప్రకారం నెగెటివ్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ను తీసుకురావాలని శ్రేణుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో లోకేశ్కు జూనియర్ ఎన్టీఆర్ అడ్డు తొలగించాలనే కుట్రలో భాగంగా, ఆయనపై వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు పెద్ద ఎత్తున లోలోపల సాగుతున్నాయనే అనుమానాలున్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటు విమర్శలను ఆ కోణంలోనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్తో ఎన్టీఆర్ భేటీ అవుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తినబోతు రుచి చూడడం ఎందుకు?