ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్న రోజా..

ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. అభిమానించే వాళ్ల నుంచి ఫోన్ కాల్ వ‌స్తే …ఆ కిక్కే వేరు క‌దా! అలాంటి అనుభూతిని…

ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. అభిమానించే వాళ్ల నుంచి ఫోన్ కాల్ వ‌స్తే …ఆ కిక్కే వేరు క‌దా! అలాంటి అనుభూతిని రోజా ఆస్వాదిస్తున్నారు. సొంత పార్టీ వాళ్లే ఈర్ష్య చెందేలా న‌గ‌రి ఎమ్మెల్యే రోజా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇటు రాజ‌కీయాల్లోనూ, అటు సినిమాల్లోనే రోజా రూటే స‌ప‌రేటు. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డడంలో రోజాకు రోజానే సాటి.

న‌మ్మిన వాళ్ల కోసం ఎందాకైనా …అనే స్థాయిలో ఆమె పోరాడుతారు. గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో ఏడాది పాటు అసెంబ్లీ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైనా …ఎక్క‌డా వెనుకాడ‌ని ధైర్య‌శాలి రోజా. ఇదే ఆమెకు ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చి పెట్టింది.

తాజాగా ఆర్కే రోజాకు తెలంగాణ కేసీఆర్ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీయ‌డం తెలుగు రాజ‌కీయాల్లో ఆస‌క్తి ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇటీవ‌ల రోజా రెండు మేజ‌ర్ ఆప‌రేష‌న్లు చేయించుకుని చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ప‌లువురు వైసీపీ నేత‌లు ఆమెను ప‌రామ‌ర్శించి ఆరోగ్య వివ‌రాలు తెలుసుకున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కూడా రోజాకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌కుండా విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు.

ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా క‌రోనాబారిన ప‌డి కోలుకుంటున్న ‌కేసీఆర్ తీరిక చేసుకుని రోజాకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను కూడా కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేయడంతో రోజా ఆనందానికి అవ‌ధుల్లేవు.

ఇదిలా ఉండ‌గా గ‌తంలో న‌గరిలో రోజా ఇంటికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లారు. అప్ప‌ట్లో త‌మిళ‌నాడులోని కాంచీపు రానికి కుటుంబంతో క‌లిసి వెళ్లిన కేసీఆర్ తిరుగు ప్ర‌యాణంలో రోజా ఇంటికి వ‌చ్చారు. రోజా ఇంట్లో లంచ్ చేశారు. 

కేసీఆర్ కుటుంబానికి రాయ‌ల‌సీమ ప్ర‌త్యేక వంట‌కాల‌తో ఆతిథ్యం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కుటుంబంతో రోజాకు వ్య‌క్తిగ‌త స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ఆమె అభిమానులు చెబున్నారు.