లేచిపోయి పెళ్లి చేసుకున్న స్టూడెంట్-టీచర్

కుర్ర విద్యార్థులు, లేడీ టీచర్ తో ప్రేమలో పడిన సినిమాలు, సందర్భాలు చాలానే చూశాం. కానీ ఇది దానికి రివర్స్. ఓ లేడీ టీచర్, కుర్ర స్టూడెంట్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు…

కుర్ర విద్యార్థులు, లేడీ టీచర్ తో ప్రేమలో పడిన సినిమాలు, సందర్భాలు చాలానే చూశాం. కానీ ఇది దానికి రివర్స్. ఓ లేడీ టీచర్, కుర్ర స్టూడెంట్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. దూరంగా వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. తమిళనాడులో జరిగింది ఈ ఘటన.

తురైయూర్ ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల కుర్రాడు కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. విచారణలో భాగంగా అదే కాలేజీలో పనిచేస్తున్న 26 ఏళ్ల మహిళా లెక్చరర్ షర్మిల కూడా కనిపించకుండా పోయిందనే విషయం బయటకొచ్చింది.

దీంతో అనుమానం వచ్చిన పోలీసులు, ఆ దిశగా విచారణ చేపట్టగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. సదరు కుర్రాడు చదువుతున్న కాలేజీలో ఆమె లెక్చరర్ గా పనిచేస్తోంది. ఆ కుర్రాడ్ని ఇష్టపడింది. విద్యార్థులందరికీ పాఠాలు చెప్పే ఆ లెక్చరర్, ఈ కుర్రాడికి మాత్రం పాఠాలతో పాటు ప్రేమపాఠాలు నేర్పించింది.

ఇద్దరూ ఆకర్షణకు లోనయ్యారు. అయితే దాన్ని ప్రేమ అనుకున్నారు. ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆమెను వెదుక్కుంటూ వెళ్లారు. పోలీసుల అనుమానమే నిజమైంది. ఆమెతోనే ఆ కుర్రాడు కూడా ఉన్నాడు.

ఆరా తీస్తే, జరిగిన కథ మొత్తం షర్మిల బయటపెట్టింది. తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుర్రాడ్ని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. షర్మిలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.