త్వరలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ కు సంబంధించి 39 మంది అభ్యర్థుల జాబితాను, ఛత్తీస్ ఘడ్ కు సంబంధించి 21 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ అధికారికంగా విడుదల చేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. బీజేపీ తొలి జాబితాను విడుదల చేసి తమ సన్నద్ధతను ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ లో ఈ రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా ముందుగానే భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఆ రాష్ట్రాల స్థాయికి తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల జాబితా కాస్త చిన్నదే. అభ్యర్థులు ఖరారు కావాల్సిన స్థానాలు చాలానే ఉన్నాయి. వేరే వివాదాలు లేని నియోజకవర్గాలకు సంబంధించి ముందుగా అభ్యర్థులను ప్రకటించినట్టుగా ఉంది భారతీయ జనతా పార్టీ.
అయితే ఛత్తీస్ ఘడ్ విషయంలో సీనియర్లను, ముఖ్య నేతల పేర్లను తొలి జాబితాలో పెట్టకపోవడం గమనార్హం. వారికి టికెట్లు దక్కబోతున్నాయా.. లేదా.. అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యనేతల పేర్లు తొలి జాబితాలో లేకపోవడంతో.. ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతూ ఉంది.
ఈ రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే మధ్యప్రదేశ్ లో ఫిరాయింపుదార్లను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లకు ముందు నుంచినే అధికారంలో కొనసాగుతూ ఉంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు సర్వత్రా ఆసక్తిని రేపబోతున్నాయి.