త్వరలోనే వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు కూడా మరెంతో సమయం లేదు. ఇలాంటి నేపథ్యంలో గత కొన్నేళ్లుగా అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా ఉంది.
కేంద్ర పన్నుల వల్ల ధరలు పెరిగినవే కాకుండా.. బియ్యం, వంట నూనె, కూరగాయల ధరలు కూడా ఈ మధ్యకాలంలో రికార్డు స్థాయికి పెరిగాయి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు కాస్త సడలింపు ఇచ్చి ప్రజల నుంచి సానుకూలత పొందడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఉంది.
ఈ నేపథ్యంలో ముందుగా.. పెట్రో ధరలను కాస్త తగ్గించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం అయిన దశలో కూడా మోడీ ప్రభుత్వం పెట్రో ధరల పై సామాన్యులకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు ఎన్నికల ముందు అయినా కాస్త ధరలు తగ్గించి మార్కులు కొట్టేసే ప్రయత్నం ఒకటి జరుగుతోందట. అలాగే దిగుమతి అయ్యే వంట నూనెపై కూడా కేంద్ర పన్నులను కాస్త తగ్గించనున్నారట. తద్వారా సామాన్యులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా ఉన్నాయి.
ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు మోడీ సర్కారుకు కొత్త కాదు. ఇప్పుడు ప్రత్యేకించి ద్రవ్యోల్బణం, నిత్యవసర వస్తువుల ధరలు అంటూ మోడీ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కాస్త ధరలు తగ్గించి ఆ మేరకు ఓట్ల లబ్ధి పొందేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్టున్నాయి. అయితే ఎన్నికల ముందు జిమ్మిక్కులను ప్రజలు పట్టించుకునే రోజులు పోయాయి. అయినప్పటికీ ప్రయత్నాలను మాత్రం బీజేపీ ఆపేట్టుగా లేదు!