ఆ మధ్య గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా తన తోటి బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగడం ఆసక్తిదాయకంగా మారింది. సరిహద్దుల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిని ఘటించే కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎంపీ పూనమ్ బెన్ కు, జడేజా భార్యకు మాటల యుద్ధం సాగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వీడియో వైరల్ గా మారింది.
తన గురించి ఎంపీ కామెంట్ చేసిందంటూ రివాబా ఆమెపై విరుచుకుపడింది. వీరిని వారించే ప్రయత్నం చేసిన మరో బీజేపీ నేత, స్థానిక మున్సిపల్ చైర్మన్ పై కూడా జడేజా భార్య అదే రేంజ్లో విరుచుకుపడటం గమనార్హం. ఈ వివాదానికి కారణం.. రివాబాను ఎంపీ పూనమ్ *ఓవర్ స్మార్ట్* అని అన్నారట!
ఆమె ఎందుకున్నారంటే.. ఆ కార్యక్రమంలో ముందుగా నివాళి ఘటించిన ఎంపీ తన కాళ్లకు చెప్పులు ధరించే ఆ పని చేశారట. జడేజా భార్య మాత్రం తను ధరించిన చెప్పులు వదిలి సైనికుల పటాలకు పూలు చల్లిందట. ఇది చూసిన ఎంపీ.. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా షూ వదలి నివాళి ఘటించరు. ఈమె ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తోందంటూ వ్యాఖ్యానించిందట. దీంతో జడేజా భార్యకు కోపం వచ్చి తన పార్టీ నేతే అయినప్పటికీ ఎంపీ పై విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది.
వీరిని వారించే ప్రయత్నం చేసిన స్థానిక మున్సిపల్ చైర్మన్ కు కూడా నువ్వెందుకు ఇన్ వాల్వ్ అవుతున్నావంటూ.. రివాబా కౌంటర్ ఇచ్చిందట. మొత్తానికి ఈ బీజేపీ మహిళా నేతల మాటల యుద్ధం వైరల్ గా మారింది.