ఇవాళ బీజేపీలో చేరనున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు రెండు బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు పబ్లిక్ చేస్తామని అసభ్య పదాలతో కూడిన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఆ బెదిరింపు లేఖపై సుదీప్ మేనేజర్ జాక్ మంజు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ లేఖలు ఎవరు పంపారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కర్ణాటకలో వరుసగా రెండోసారి కూడా కాషాయ కండువాను ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ ఈసారి స్టార్ క్యాంపెయినర్లుగా సినీ స్టార్లను రంగంలోకి దించుతోంది. వారిలో కిచ్చా సుదీప్ ఒకరు. కర్ణాటకలో సుదీప్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. కర్ణాటకలో షెడ్యూల్ కులాల కిందకు వచ్చే నాయక సామాజిక వర్గం కళ్యాణ-కర్ణాటక ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో నాయక సామాజిక వర్గానికి చెందిన సుదీప్ వల్ల బీజేపీకి కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంది.
కిచ్చా సుదీప్.. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్కు పరిచయమ్యారు. ఇవాళ బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర ముఖ్య నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.