తెలంగాణలో టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఎపిసోడ్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి అరెస్ట్పై బీజేపీ తీవ్ర ఆగ్రహంగా వుంది. మరోవైపు విద్యార్థుల జీవితాలతో బీజేపీ ఆడుకోడానికి పరీక్ష పత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎఎస్ నేతలు దురు దాడికి దిగారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటైన ట్వీట్ చేశారు. బండి సంజయ్ని పిచ్చోడి కింద జమ కట్టారు. అలాంటి నాయకుడి చేతిలో ఒక పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. వ్యంగ్య ధోరణిలో చేసిన ఆ ట్వీట్ ఏంటంటే…
“పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ బద్నాం అవుతున్నట్టే కనిపిస్తోంది. దీని నుంచి బయట పడడానికి బీజేపీ అనుసరించే వైఖరి ఏంటనేది ఆసక్తికరంగా మారింది.