ఏకంగా కోర్టులో భార్యపై భర్త యాసిడ్ దాడి

తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఏకంగా కోర్టు ఆవరణలోనే భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కోయంబత్తూర్ లో జరిగింది. ఏకంగా కోర్టులో ఓ మహిళపై…

తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఏకంగా కోర్టు ఆవరణలోనే భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కోయంబత్తూర్ లో జరిగింది. ఏకంగా కోర్టులో ఓ మహిళపై ఇలా యాసిడ్ దాడి జరగడం సంచలనంగా మారింది.

కవిత, శివకుమార్ దంపతులు. కవిత ఓ దొంగ, శివకుమార్ లారీ డ్రైవర్. 2016లో ఓ దొంగతనం కేసులో కవిత ఆరెస్ట్ అయింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకొచ్చింది. ఈ కేసు జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోని ఫస్ట్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ వద్ద నడుస్తోంది. బెయిల్ పై ఉన్న కవిత, ఎప్పటికప్పుడు కోర్టు వాయిదాలకు హాజరవుతోంది.

ఇదిలా ఉండగా.. జైలు నుంచి బయటకొచ్చిన కవిత, లారీ డ్రైవర్ అయిన శివకుమార్ తో సంసారం చేయలేదు. ఆమె మరో వ్యక్తికి దగ్గరైంది. అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో శివకుమార్ కు తెలిసి ఎన్నోసార్లు మందలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో.. ఓ రోజు కవిత, తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. శివకుమార్, ఇద్దరు పిల్లల్ని వదిలేసింది. దీంతో శివకుమార్ కు కోపం కట్టలు తెంచుకుంది. కవితపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ఎక్కడుందో అతడికి తెలీదు.

అయితే కోర్టు వాయిదాలకు మాత్రం ఆమె తప్పనిసరిగా వస్తుందని తెలుసు. అందుకే కాపు కాశాడు. ఆ రోజు రానే వచ్చింది. కోర్టుకు కవిత వచ్చింది. వెంటనే తనతో తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోశాడు శివకుమార్. ఊహించని ఘటనతో చుట్టుపక్కలున్న లాయర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వెంటనే తేరుకొని కవితను హాస్పిటల్ కు తరలించారు. కోర్టు ఆవరణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన శివకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కవిత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.