కాలగర్భంలో కలవనున్న కాలీ పీలీ టాక్సీలు

ముంబయి మహానగరం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే అంశం అక్కడ నలుపు-పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. ఈ రంగుల ఆధారంగా వీటిని అక్కడి జనం ముద్దుగా కాలీ-పీలీ ట్యాక్సీ అని పిలుచుకుంటారు. నిజానికి ఇవి…

ముంబయి మహానగరం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే అంశం అక్కడ నలుపు-పసుపు రంగులో కనిపించే ట్యాక్సీలు. ఈ రంగుల ఆధారంగా వీటిని అక్కడి జనం ముద్దుగా కాలీ-పీలీ ట్యాక్సీ అని పిలుచుకుంటారు. నిజానికి ఇవి ప్రీమియర్ పద్మిని టాక్సీలు.

6 దశాబ్దాలుగా ముంబయి రోడ్లపై పరుగులుపెట్టిన ఈ టాక్సీలకు ఇప్పుడు కాలంచెల్లింది. ఇకపై కాలీ-పీలీ టాక్సీలు చరిత్రకే పరిమితం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ముంబయిలో కాలీ-పీలీ ట్యాక్సీలు తగ్గిపోయాయి. రేపట్నుంచి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే రవాణా అధికారులు వాటిని సీజ్ చేస్తారు.

20 ఏళ్ల గడువు దాటిన వాహనాల్ని రోడ్లపైకి అనుమతించడం లేదు. పద్మిని టాక్సీలన్నీ ఎప్పుడో ఆ పరిమితి దాటేశాయి. ఇంకా చెప్పాలంటే, ముంబయి ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ లో చిట్టచివరి కాలీ-పీలీ టాక్సీ 2003, అక్టోబర్ 29న రిజిస్టర్ అయింది. అంటే దీనర్థం, ప్రస్తుతం ముంబయి రోడ్లపై తిరుగుతున్న ప్రతి పద్మినీ టాక్సీ కాలపరిమితి ముగిసిందన్నమాట.

ఇండియాలో తయారైన తొలి 4 సీట్ల సెలూన్ కారు ప్రీమియర్ పద్మిని. ఫియట్ కంపెనీతో కలిసి వాల్ చంద్ గ్రూప్, 1964లో ఈ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పట్నుంచి ఇవి భారత్ లో భాగమయ్యాయి. మరీ ముఖ్యంగా ముంబయి సంస్కృతిలో కలిసిపోయాయి. అయితే రవాణా సౌకర్యాలు పెరగడంతో కాలీ-పీలీ టాక్సీలకు ఆదరణ తగ్గింది. పైగా చట్టాలు కూడా మారడంతో, ఈ కార్లు ఇప్పుడు అంతరించిపోక తప్పలేదు.

ఈ టాక్సీలు భారతీయ సినిమాలో కూడా ఓ భాగంగా మారాయి. ఎన్నో సినిమాల్లో ఈ తరహా టాక్సీల్ని చూడొచ్చు. వీటిని కొనుగోలు చేసి, వింటేజ్ కలెక్షన్ కింద గ్యారేజీలో పెట్టుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.