నీట్ నిర్వహణలో లోపాలు.. విద్యార్థులకు న‌ష్టం!

సంవత్సరం పాటు నిద్రాహారాలు మాని పరీక్షకు సిద్ధమైతే అధికారుల అలసత్వం కారణంగా ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష నిర్వహణలో అనేక లోపాలు కనిపించాయి. దీనివల్ల విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నీట్ పరీక్షలు పక‌డ్బందీగా నిర్వహిస్తామని ఎన్ టి ఏ ప్రకటించింది. అయితే అందుకు తగినట్లుగా కసరత్తు చేసిన దాఖ‌లాలు లేవ‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో వారు వ్యవహరించిన తీరు వల్ల విద్యార్థులు నష్టపోయారు. పరీక్ష సమయానికంటే మూడు గంటలు ముందుగా పరీక్ష కేంద్రానికి రావాలని చెప్పిన ఎన్ టి ఏ … ఆ విధంగా వచ్చిన విద్యార్థులతో పరీక్ష సమయానికి ముందుగా చేయాల్సిన తంతును సక్రమంగా నిర్వహించలేదు.

వాస్తవంగా పరీక్ష మొదలైన తర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీయకూడదు. పరీక్ష మొదలయ్యాక అటెండెన్స్, ఫింగర్ ప్రింట్స్, సంతకాల పేర్ల‌తో ఒక్కో విద్యార్థిని నాలుగు నుంచి ఐదు సార్లు పరీక్ష మధ్యలో మాట్లాడించి ఏకాగ్రతకు భంగం కలిగించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైతే ఉదయం 11 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ మూడు గంటల సమయంలోనే అటెండెన్స్, వేలిముద్రలు తీసుకోవడం వంటి తంతు పూర్తి చేయాలి. అయితే సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో ఇవన్నీ పరీక్ష మధ్యలో చేశారు. దీంతో తమ ఏకాగ్రతకు భంగం కలిగినట్లు విద్యార్థులు వాపోతున్నారు.

వాస్తవంగా పరీక్ష మొదలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు దగ్గరికి ఇన్విజిలేటర్స్ వెళ్లకూడదు. కానీ రకరకాల కారణాలతో ఒక విద్యార్థి దగ్గరికి నాలుగైదు సార్లు వెళ్లి ప‌రీక్ష రాస్తున్న‌ సమయంలో వాళ్ళ కేంద్రీకరణ దెబ్బ తినేలా, దృష్టి మళ్లించేలాగా వ్యవహరించార‌ని విద్యార్థులు మండిపడుతున్నారు దీనివల్ల ఒక విద్యార్థికి పది నిమిషాల నుంచి 15 నిమిషాల దాకా సమయం వృథా అయ్యిందని చెబుతున్నారు. అస‌లు అడ్మిట్ కార్డు ఎలా వుంటుంది,‌ ఫొటోలు ఎన్ని కావాలి వంటి ప్రాథమిక విషయాలు కూడా సిబ్బందికి అవగాహన కల్పించలేదు.

వాస్తవంగా అడ్మిట్ కార్డు మీద పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఒకటి, పోస్ట్ కార్డు సైజు ఫొటో ఒకటి అంటించాలి. అదే విధంగా అటెండెన్స్ రిజిస్టర్ లో అంటించడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఒకటి వెంట తీసుకెళ్లాలి. విద్యార్థులు ఇలాగే చేశారు. అయితే పరీక్ష కేద్రం వద్ద…ఒక పోస్టుకార్డు సైజు ఫొటో, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురండి…అని అక్కడ సిబ్బంది ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఫొటోల కోసం పరుగులు తీశారు. ఇలా సిబ్బంది విద్యార్థులను గందరగోళపరిచారు.

మ‌రికొన్ని కేంద్రాల్లో నిర్ణీత స‌మ‌యం కంటే ఆల‌స్యంగా విద్యార్థుల్ని ప‌రీక్ష కేంద్రాల్లోకి పంపారు. ఒక నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష కేంద్రాల్లోకి అనుమ‌తించేది లేద‌ని రూల్స్ గురించి తెగ ఉప‌న్యాసాలు చెప్పే అధికారులు, తాము మాత్రం అందుకు అతీతుల‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు విద్యార్థులు, వాళ్ల త‌ల్లిదండ్రుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాలలో నీట్ పరీక్ష కోసం అస్తవ్యస్తంగా ఏర్పాట్లు చేశారు. ఎన్ టి ఏ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటలకు కళాశాల లోపలికి అనుమతించాల్సి ఉంది. కానీ 40 నిమిషాల ఆలస్యంగా లోపలికి అనుమతించారు. పరీక్ష హాల్లో సమయం చూసుకోవడానికి క‌నీసం గోడ గడియారం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటు కూడా చేయకపోవడంతో విద్యార్థులు సమయం తెలియక గందరగోళానికి గురయ్యారు. చివరి గంటలో సమయం తెలియడంతో అయోమయంలో పడి తెలిసిన ప్రశ్నలకు కూడా సరైన జవాబులు గుర్తించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంవత్సరం పాటు నిద్రాహారాలు మాని పరీక్షకు సిద్ధమైతే అధికారుల అలసత్వం కారణంగా ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా నీట్ విద్యార్థుల ఆశ‌ల‌పై నిర్వాహ‌కుల అల‌స‌త్వం నీళ్లు చ‌ల్లింద‌న్న విమ‌ర్శ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

3 Replies to “నీట్ నిర్వహణలో లోపాలు.. విద్యార్థులకు న‌ష్టం!”

  1. salary lu dobbu taaru, sarigga pani cheyyaru. reservation lo job lu iste , ilaage quality leni service vuntadi. inka ennallu ee quality leni service lu, reservation based jobs. Desam mundu ku vellali ante, governament service shall be at very high level. 

  2. 36అడుగుల ఛాతీ శిరోజాలతో ఆడుకునే మచ్చల మల్లికి ప్రశ్నించి న్యాయం చేసే “డ్రమ్ము” ఉందా? స్టాలిన్ 1౦౦౦ టైమ్స్ బెటర్

Comments are closed.