గత లోక్ సభ ఎన్నికలో మండ్యా నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు నటి సుమలత. ఆ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆమె భర్త , కన్నడస్టార్ హీరో అంబరీష్ దివంగతులయ్యారు. ఆ సానుభూతికి తోడు.. జేడీఎస్ ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్, బీజేపీలు లోలోన సపోర్ట్ చేయడంలో సుమలత విజయం సునాయాసం అయ్యింది. జేడీఎస్ ఫస్ట్ ఫ్యామిలీ నుంచి కొత్త తరంగా రాజకీయాల్లోకి వచ్చిన డీకే కుమారస్వామి తనయుడు నిఖిల్ పై సుమలత విజయం సాధించారు.
జేడీఎస్ కు సానుకూల లోక్ సభ నియోజకవర్గంలో అలా ఇండిపెండెంట్ గా సుమలత విజయం సాధించారు. ఎన్నికల తర్వాత ఆమె కమలం పార్టీ తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయినప్పటికీ ఇప్పుడు సుమలతను బీజేపీ పట్టించుకోవడం లేదు! జేడీఎస్ తో పొత్తు నేపథ్యంలో మండ్య ఎంపీ సీటు పోటీ విషయంలో ఆ పార్టీకి అవకాశం ఇచ్చింది కమలం పార్టీ. ఇప్పటికే అక్కడ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఎంపీగా పోటీ చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు.
ఇలా కుమారస్వామి అసెంబ్లీ సీటును ఖాళీ చేసి లోక్ సభ వైపు చూస్తున్నారు! బీజేపీ తో పొత్తు నేపథ్యంలో జేడీఎస్ కు మూడంటే మూడు లోక్ సభ సీట్లలో పోటీకి అవకాశం లభించింది. అవి మూడూ జేడీఎస్ కు ఒకప్పటి కంచుకోటలే! 19 అసెంబ్లీ సీట్లను కలిగి ఉండి వంద అసెంబ్లీ సీట్లలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకును కలిగి ఉన్న జేడీఎస్ బీజేపీ దెబ్బకు మూడంటే మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితం అయ్యింది.
జేడీఎస్ పోటీకి అవకాశం దక్కిన సీట్లలో మొత్తం దేవేగౌడ కుటుంబమే పోటీకి దిగుతోంది! ఒకవైపు కుటుంబ పార్టీలు అంటూ బీజేపీ వాళ్లు పొద్దున లేస్తే విమర్శిస్తూ ఉంటారు. జేడీఎస్ ను కూడా ఎన్నో మాటలన్నారు. ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు, ఆ పార్టీ తరఫున అంతా దేవేగౌడ కుటుంబీకులే పోటీ! ఇక సుమలత విషయానికి వస్తే.. ఇప్పుడు కుమారస్వామితో దోస్తీ నేపథ్యంలో ఆమెను బీజేపీ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థిని ప్రకటించింది. తన తదుపరి కార్యాచరణ ఏప్రిల్ మూడున ప్రకటించబోతున్నట్టుగా సుమలత ప్రకటించారు. మరి ఇండిపెండెంట్ గా మరోసారి బరిలోకి దిగి సత్తా చూపేందుకు సుమలత సిద్దంగా ఉన్నారో లేదో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు