పేరుకి కార్మికుడు.. ఖాతాలో రూ.221 కోట్ల డబ్బు

పేరు.. శివప్రసాద్ నిషాద్. స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బస్టీ జిల్లా. ఇతడు మాత్రం ఢిల్లీలో పని చేస్తుంటాడు. చేసేది కూలి పని. కానీ ఇతడి ఎకౌంట్ లో మాత్రం అక్షరాలా 221 కోట్ల రూపాయల…

పేరు.. శివప్రసాద్ నిషాద్. స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బస్టీ జిల్లా. ఇతడు మాత్రం ఢిల్లీలో పని చేస్తుంటాడు. చేసేది కూలి పని. కానీ ఇతడి ఎకౌంట్ లో మాత్రం అక్షరాలా 221 కోట్ల రూపాయల డబ్బు ఉంది.

ఒక రోజు శివప్రసాద్ ఇంటికి ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే అది ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసు. ఎకౌంట్ లో 221 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీ జరిగిందని, వెంటనే తగిన పత్రాలతో ఆఫీసుకు రావాలని అందులో ఉంది.

ఆ నోటీసు అందుకున్నంతవరకు తన ఎకౌంట్ లో అంత మొత్తం ఉందని శివప్రసాద్ కు తెలియదు. వెంటనే అతడు ఆదాయపు పన్ను శాఖ ఆఫీస్ కు చేరుకున్నాడు. జరిగింది చెప్పాడు.

నిజానికి శివప్రసాద్ కు 3 బ్యాంక్ ఖాతాలున్నాయి. నాలుగోది కూడా ఉందనే విషయం అతడికి తెలియదు. ఆ ఖాతాలోనే ఈ భారీ మొత్తం జమ అయింది. తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని, తన పేరిట మరో ఖాతా ఉన్నట్టు తనకు తెలియదని అంటున్నాడు ఈ కార్మికులు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

మరోవైపు పోలీసులు, అదాయపు పన్నుశాఖ అధికారులు శివప్రసాద్ మాట నమ్మడం లేదు. అతడి నుంచే విచారణ ప్రారంభించారు. శివప్రసాద్ చెబుతున్న మాటలు నిజమా కాదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

వ్యక్తిగత వివరాలు జాగ్రత్త.. ఈ సందర్భంగా మరోసారి వ్యక్తిగత వివరాల గోప్యతపై అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్లకు పాన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లు ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని, తమకు తెలియకుండానే కేసుల్లో ఇరుక్కుంటారని హెచ్చరిస్తున్నారు.

ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పుట్టినతేదీ ధృవీకరణ పత్రం లాంటివి సమర్పించేటప్పుడు ఒకటికి రెండుసార్లు నిర్థారించుకున్న తర్వాతే ఇవ్వాలని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా జిరాక్స్ సెంటర్లలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.