మధ్యప్రదేశ్ లో ప్రజలు మినిమం మెజారిటీని ఇచ్చినా కాంగ్రెస్ అంతర్గత కలహాలతో ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయం వల్ల దక్కిన అవకాశాన్ని బీజేపీ బాగా ఉపయోగించుకుని, ప్రజలు అధికారం ఇవ్వకపోయినా దక్కించుకుంది!
ఇక పంజాబ్ లో ముఖ్యమంత్రి మార్పును చేసే చిత్తయ్యిందో లేదో కానీ.. పంజాబ్ లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై భారీ రచ్చ జరిగింది. అమరీందర్ సింగ్- సిద్ధూల మధ్యన బ్యాలెన్స్ చేయలేక మూడో వ్యక్తిని సీఎంగా చేసి కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకుంది.
అలాగే రాజస్తాన్ లో కాంగ్రెస్ కలహాల కాపురం కొనసాగుతూ ఉంది. సచిన్ పైలట్ అసంతృప్తవాదిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటాలు జారీ చేస్తూ ఉన్నాడు. అవినీతి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా కూడా సచిన్ పైలట్ మరోసారి గెహ్లాట్ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు.
ఇప్పటికే రాజస్తాన్ లో పైలట్ వర్గం ఎమ్మెల్యేలు ఒకటీ రెండు భేటీలు వేశారు. ఎన్నికలకు ముందు సంవత్సరం పైలట్ ను సీఎంగా చేస్తానంటూ అధిష్టానం హామీ ఇచ్చిందట అప్పట్లో. అయితే త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్తాన్ లో గెహ్లాట్, పైలట్ ల మధ్యన చిచ్చు కొనసాగుతూనే ఉంది!
మరి ఇలాంటి అనుభవాలన్నింటిని నుంచి కాంగ్రెస్ హైకమాండ్ ఏం పాఠాలు నేర్చుకుందనేది కర్ణాటక వ్యవహారాన్ని బట్టి తెలియనుంది. మధ్యప్రదేశ్ లో ఒక సీనియర్ మరో జూనియర్ మధ్యన తేల్చలేక కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని కోల్పోయింది. పంజాబ్ లో అమరీందర్- సిద్ధూల మధ్యన పెద్ద యుద్ధానికి కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించి, చివరకు ఇద్దరికీ కాకుండా చేసి ఎదురుదెబ్బతింది. రాజస్తాన్ రచ్చ ఇంకా ఏమవుతుందో కాంగ్రెస్ హైకమాండ్ కే తెలుస్తున్నట్టుగా లేదు.
సరిగ్గా అలాంటి రచ్చే కర్ణాటకలోనూ తప్పేలా లేదు. సిద్ధరామయ్య- డీకేశి ల్లో ఎవరికి అవకాశం ఇచ్చినా మరొకరు రచ్చ చేయకమానరు. చెరో రెండున్నరేళ్ల ఒప్పందం అధిష్టానం కుదిర్చే అవకాశాలున్నట్టుగా ఉన్నాయి. ఈ ప్రతిపాదన సిద్ధరామయ్య నుంచినే వస్తోందట. ముందు అవకాశం తనకు ఇచ్చేయాలని, చివరి రెండున్నరేళ్లూ డీకే కి ఇవ్వొచ్చని సిద్ధరామయ్య అధిష్టానం ముందు తన ప్రతిపాదన పెట్టేశాడట. మరి అనుభవాల నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తగవును పరిష్కరించుకోగలదు.