బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్నాడని ఆత్మహత్య

చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. మొబైల్ వద్దన్నందుకు కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్య కోడికూర వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న…

చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది. మొబైల్ వద్దన్నందుకు కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. భార్య కోడికూర వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న లాంటి ఘటనలు కూడా చూశాం. ఇది కూడా అలాంటిదే.

భార్యను బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని మందలించాడు భర్త. అంతే.. భార్య మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంటనే ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన

ఇండోర్ లో నివశిస్తున్నారు బలరాం యాదవ్, రీనా దంపతులు. వీళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్థలున్నాయి. ప్రతి విషయానికి గొడవ పడుతుంటారని ఇరుగుపొరుగు వాళ్లు చెబుతుంటారు. కొన్నిసార్లు అంతా కలిసి సర్దిచెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రీనా, బ్యూటీ పార్లర్ కు బయల్దేరింది.

అది గమనించిన బలరాం యాదవ్, భార్యను వారించాడు. బ్యూటీపార్లకు వెళ్లొద్దని హుకుం జారీచేసి బయటకెళ్లాడు. దీంతో రీనా హర్ట్ అయింది. కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొద్దిసేపటికి బలరాం తిరిగొచ్చాడు. భార్యను పిలిచాడు బలరాం. గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చి తలుపుతెరిచి చూస్తే, రీనా ఉరి వేసుకొని కనిపించింది.

జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య వెనక దాగున్న కారణాల్ని వెలికితీసే పనిలో పడ్డారు. బలరాం, రీనా కుటుంబీకుల మధ్య ఉన్న పాత గొడవలపై కూడా ఎంక్వయిరీ మొదలుపెట్టారు.