భూములు అమ్మం… మరి స్టీల్ ప్లాంట్ సంగ‌తేంటి… ?

బీజేపీ నాయకుల మాటలు  స్టీల్ ప్లాంట్  ఉద్యమ కారులకు అయితే అసలు  అర్ధం కావడంలేదు. ఒక బీజేపీ నాయకుడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు, అక్కడే ఉంటుంది అని అంటారు, మరో…

బీజేపీ నాయకుల మాటలు  స్టీల్ ప్లాంట్  ఉద్యమ కారులకు అయితే అసలు  అర్ధం కావడంలేదు. ఒక బీజేపీ నాయకుడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు, అక్కడే ఉంటుంది అని అంటారు, మరో నేత స్టీల్ ప్లాంట్ విషయంలో చేయాల్సిన  న్యాయం చేస్తామని అంటారు. ఎవరేమి చెప్పినా ప్రైవేటీకరణం విషయంలో మాత్రం కరెక్ట్ గా స్పందించి మాట్లాడింది అయితే  లేదు.

అంటే ప్లాంట్ ప్రైవేటీకరణను పక్కన పెట్టి డొంక తిరుగుడుగా మాట్లాడడమే అలవాటు చేసుకున్నారు అనుకోవాలి. ఇక బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇపుడు మరింత గందరగోళం కలిగేలా స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ భూములు అమ్మమని ఆమె పక్కా క్లారిటీగానే చెబుతున్నారు, మరి స్టీల్ ప్లాంట్ విషయం అంటే ఆలోచించుకోవాల్సిందే.

అంటే బీజేపీ నేతలు ఎవరు చెప్పినా ప్లాంట్ ప్రైవేట్ చేయడమో, లేక అమ్మడమో అన్నది ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నారనుకోవాలి. ఇలా అర్ధం కాకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరు పట్లనే స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు మండిపోతున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అని చెప్పి ఎందుకు దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేయరూ అన్నదే కార్మికుల ప్రశ్న.

మరో వైపు చూస్తే ఏపీ అంతా అప్పుల కుప్పగా మారిపోయిందని, మూడేళ్లలో మూడు లక్షల కోట్ల పైన అప్పులు చేసి జగన్ ఏపీని నాశనం చేశారని పురంధేశ్వరి విమర్శిస్తున్నారు. ఇచ్చే నిధులు అన్నీ కూడా కేంద్రానివే అని కూడా ఆమె చెబుతూ ఏపీలో అభివృద్ధి మాత్రం లేదని కామెంట్స్ చేస్తున్నారు.

అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, రేపటి ఆదాయాలను చూపించి ఇవాళ అప్పులు చేయడం ఏపీలోనే చూస్తున్నామని పురంధేశ్వరి మండిపడుతున్నారు. మరి కేంద్రం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో అమ్మకానికే పెడుతోంది కదా అంటే మాత్రం బీజేపీ నేతలు మాట్లాడరేమో. అంటే కేంద్రం అప్పులు చేయవచ్చు, దేన్ని అయినా అమ్మేయవచ్చు. కానీ ఏపీ మీదనే విమర్శలు చేస్తామని అంటే మరి బీజేపీని తేడా గల పార్టీ అనకుండా ఏమనుకోవాలని సెటైర్లు పడుతున్నాయి.

మొత్తానికి ఏపీలో అన్నీ మేమే చేశామ, అంతా మా డబ్బులే అని చెబుతున్నా జనాలు ఎందుకు రియాక్ట్ కావడంలేదో ఆలోచించుకుని విభజన హామీలను నెరవేర్చే పని ఏదో బీజేపీ చేస్తే మేలు అన్న సూచనలు కూడా వస్తున్నాయి. అయినా కానీ కమలనాధులు వింటారా. ఏమో.