నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి తెలుగు ఫిలించాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సినీ ఇండస్ట్రీపై నల్లపురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారనే వ్యాఖ్యలను ప్రసన్నకుమార్రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రసన్నకుమార్రెడ్డి సినిమా ఇండస్ట్రీపై దుర్భాషలాడారన్నారు. ఎవరూ మాట్లాడకూడని విధంగా ఆయన నోరు పారేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా ఇది ఆయనకే వర్తిస్తుందేమో అని వెటకరించారు.
వాళ్ల నాన్న అంటే తమకెంతో గౌరవం ఉందన్నారు. ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు అప్రజాస్వామికమన్నారు. ఎవరూ సినిమా ఇండస్ట్రీలో బలిసి కొట్టుకోలేదన్నారు. సినిమాల్లో నటించడం అంటే ఈజీ కాదన్నారు. ఒకసారి వంద అడుగుల రోప్ పైకి ఎక్కి, నటిస్తే ఆయనకు ఆ శ్రమ ఏంటో తెలుస్తుందని హితవు చెప్పారు. తాము కూడా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మీద మాట్లాడొచ్చన్నారు.
అయితే తమకు సంస్కారం ఉండడం వల్లే ఆయనలా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. మీడియా ముందు మాట్లాడితే హీరోలు అయిపోతామని అనుకుంటున్నారని తప్పు పట్టారు. మీ రాజకీయ జీవితం ఏంటో కోవూరు ప్రజల్ని అడిగితే చెబుతారని ఎన్వీ ప్రసాద్ అన్నారు.