ఆంధ్రప్రదేశ్లో సినిమా సమస్యలపై చర్చించేందుకు కొత్త రాయబారి రానున్నారు. ఆ రాయబారి మరెవరో కాదు…తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల నియంత్రణపై వివాదం నెలకుంది. ఇది న్యాయస్థానం వరకూ వెళ్లింది. అలాగే సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదల, రోజుకు మూడు ఆటలకు మాత్రమే అనుమతి తదితర సమస్యలున్నాయి. అలాగే సంక్రాంతి తర్వాత కర్ఫ్యూ అమల్లోకి రానుండడంతో ఇష్టానుసారం సినిమాలు ప్రదర్శించేందుకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సడలింపు ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ దృష్టికి వెళ్లాయి.
ఏపీ ప్రభుత్వం తన వాదనపై గట్టిగా నిలబడింది. ఎవరెన్ని చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల సమస్యలపై తాను ఆ రాష్ట్ర మంత్రులతో చర్చిస్తానన్నారు. తమ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు పెద్దపీట వేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
తెలంగాణలో టికెట్ ధరలు పెంచామని.. ఐదో ఆటకు కూడా అనుమతి ఇచ్చామన్నారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్గా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన అన్నారు. సినిమాకు కులం మతం ప్రాంతాలు ఉండవన్నారు హైదరాబాద్లో సినీ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై బలవంతంగా నిర్ణయాలు తీసుకోదన్నారు.
ప్రస్తుత కరోనా పరిస్థితులు ఉధృతంగా ఉంటే ఆంక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే త్వరలో ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఏపీ కంటే ముందుగానే ఆన్లైన్లో టికెట్ల విక్రయించాలని తమ ప్రభుత్వం ఆలోచించిందన్నారు. అయితే కొన్ని లీగల్ సమస్యల వల్ల జాప్యమైందన్నారు. సినీ పెద్దల విజ్ఞప్తి మేరకే టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తలసాని వెల్లడించారు.