ఎన్వీ ర‌మ‌ణ మాట‌ల్లో….ఎన్టీఆర్ విజ‌యం ర‌హ‌స్యం!

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సినీ నేప‌థ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ విష‌యంలో భిన్నాభిప్రాయం ఉంది. ఈ…

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న సినీ నేప‌థ్య‌మే కార‌ణ‌మ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఆ విష‌యంలో భిన్నాభిప్రాయం ఉంది. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించ‌డం విశేషం.

‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఎన్వీ ర‌మ‌ణ‌ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో రాణించ‌డానికి, ఆయ‌న తెలుగు భాషా ప్రావీణ్యానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో ఎన్వీ ర‌మ‌ణ చెప్పుకొచ్చారు.

‘నందమూరి తారక రామారావుగారు అగ్రశ్రేణి సినీనటుడు కావ‌డం వ‌ల్లే ఆయన సులువుగా అధికారంలోకి వ‌చ్చార‌ని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుత ఉచ్ఛారణతో  అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించింది’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. 

భాష గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు ఆయ‌న ఈ ఉదాహ‌ర‌ణ చెప్పారు. అంటే ప్ర‌జ‌ల్ని మాతృభాష ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో ఎన్టీఆర్ రాజ‌కీయ విజ‌యాన్ని ఆయ‌న ఉద‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

ఇదే స‌మావేశంలో మాతృభాష విశిష్ట‌త గురించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని హెచ్చ‌రించారు. ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ పిలుపునిచ్చారు. ఆంగ్లం మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని ఆయ‌న హిత‌వు ప‌లికారు.