Advertisement

Advertisement


Home > Politics - Opinion

అస్సలు..బుర్ర వుండి చేసే పనులేనా ఇవి?

అస్సలు..బుర్ర వుండి చేసే పనులేనా ఇవి?

కొన్ని సార్లు కొన్ని పనులు ఎందుకు చేస్తారో. ఎవరు చేయమని చెబుతారో, ఎవరి బుర్రలో ఇలాంటి ఆలోచనలు పుడతాయో కానీ వాళ్లను మహానుభావులు అనుకోవాల్సిందే. అసలు ఈ పనులు అన్నీ వైఎస్ జగన్ దృష్టికి వెళుతున్నాయా? ఆయన కూడా వాటిని సపోర్ట్ చేస్తున్నారా? అన్నది కూడా అర్థం కాదు. 

సిఎమ్ గా వైఎస్ జగన్ కు థ్రెట్ వుండి వుండొచ్చు. ముఖ్యంగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుమానాస్పద మృతి అనే భయం వెంటాడుతూనే వుండొచ్చు. సిఎమ్ కాక ముందు పాదయాత్ర నిర్బయంగా చేసినట్లు ఇప్పుడు చేయలేరు. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఎంతో మందికి టార్గెట్. కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని కలిగిన ఓ వర్గానికి శతృవు. అందువల్ల తన జాగ్రత్త తనకు వుండడం తప్పు కాదు.

కానీ ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు మాత్రం కాస్త కాదు ఎక్కువ అతిగానే వుంటున్నాయి. అన్నీ మూసేస్తే జగన్ కు ఇక పోలీసులు ఎందుకు రక్షణ కల్పించడానికి. అన్నీ అలా వుండగానే రక్షణ కల్పించగలగాలి. సరే రోడ్ పక్కన బారకేడ్లు ఫరవాలేదు. దుకాణాలు మూత ఎందుకు? ఎవరైనా వాటిల్లో దాగుండి అటాక్ చేస్తారనా? సరే అది కూడా ఓకె అనుకుందాం.

నల్ల దుస్తులు, నల్ల చున్నీలు ఏం చేసాయి? మరీ ఇది ఓవర్ గా అనిపించడం లేదూ. దీనికి ఏదైనా వివరణ ఇవ్వగలరా? అమ్మాయిల చున్నీలు తీయించడం అన్నది కచ్చితంగా అమానుషం కదా? అమానవీయం కాదా? అవమానం కాదా? అలాంటపుడు ముందే టముకు వేయించేల్సింది. నల్ల చున్నీలు ధరించిన వారు వీధుల్లోకి రావద్దు. వచ్చినా జగన్ సభ వైపు రావద్దు..వచ్చినా సభా ప్రాంగణంలోకి రావద్దు అని. ఎంత సిగ్గుమాలిన పని ఆడపిల్లల పమిటలు తీయించడం అంటే. దీనికి జగన్ కచ్చితంగా వివరణ ఇవ్వాలి.

రోజా తల్లీ..ఇదేం పనమ్మా?

ఇది డిజిటల్ యుగం. ప్రతి చోటా వేలాది కెమేరా కళ్లు. ఇలాంటి టైమ్ లో రాజకీయ నాయకులే కాదు. అందరూ జాగ్రత్తగా వుండాలి. అలాంటిది తాను గుడిలోకి వెళ్తున్నా..వెనుక ఎవరూ రాకుండా తలుపులు మూసేయండి..గంటలు గంటలు తాను, తన కుటుంబం గుడిలో వుంటాం ఏకాంతంగా అని అనడం ఎంత వరకు సబబు రోజా గారూ? అసలు గుడి తలపులు అలా ఎప్పుడు పడితే అప్పుడు మూసేస్తారా? అర్థం వుందా? అన్ని గంటలు బయట జనాలు మీ ముచ్చట కోసం వేచి వుండాలా?

అసలే ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా నిత్యం ఏం దొరుకుతుందా అని భూతద్దం పెట్టుకుని చూస్తున్నారు. వాళ్ల చేతికి ఇదిగో తీసుకోండి అంటూ నిత్యం మంచి మసాలా కంటెంట్ ను వైకాపా జనాలే అందిస్తున్నారు. భలే గొప్పోళ్లు వైకాపా నేతలు..అధికారులు. వీళ్లను పెట్టుకుని, నమ్ముకుని జగన్ పాలన చేయడం, 2024 ఎన్నికల్లో 175/175 టార్గెట్ చేయడం. సరిపోయింది.

ఆర్వీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?