టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కోలుకోలేని దెబ్బ కొట్టారు. అధికారంలో వుంటూ వైసీపీ చేయలేని పనిని ఆ పార్టీ రెబల్ అభ్యర్థి రఘురామ భారీగా దెబ్బకొట్టి చూపించారు. వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపే మాట రఘురామ నోటి నుంచి రావడం విచిత్ర పరిణామంగా చెప్పొచ్చు.
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బోస్డీకే అంటూ తీవ్ర అభ్యంతరకర భాషలో పట్టాభి దూషించిన సంగతి తెలిసిందే. పట్టాభి నోటి దురుసు ఆంధ్రప్రదేశ్లో విద్వేష రాజకీయాలకు తెరలేపింది. సీఎంపై అవాకులు చెవాకులు పేలిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 24 గంటలు కూడా గడవకనే ఆయనకు బెయిల్ మంజూరైంది.
ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఏం జరిగిందో రఘురామకృష్ణంరాజు సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కస్టడీలో పట్టాభిని పోలీసులు కొట్టారని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పట్టాభిని కొట్టారా లేదా అనేది ఎంపీ విజయసాయి చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. పట్టాభిని కొట్టారన్న దానిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని రఘురామ చెప్పుకొచ్చారు.
తనను అరెస్ట్ చేస్తారనే అనుమానంతో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు రఘురామకు పోలీసు కస్టడీలో జరిగిన సత్కారాన్ని దృష్టిలో పెట్టుకుని, తనకు కూడా అలాంటిదే జరగొచ్చని పట్టాభి ఆందోళన చెందారు. అందుకే అరెస్ట్కు ముందు తన శరీరంలోని అణువణువు వీడియో రికార్డ్ చేసి తనకేం జరిగినా పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని పట్టాభి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
బెయిల్పై విడుదలైన పట్టాభి తనను పోలీసులు ఉతికారనే సంగతి చెప్పలేదు. కానీ పట్టాభిని పోలీసు కస్టడీలో కొట్టారని రఘురామ చెప్పడం వైరల్ అవుతోంది. తనను కొట్టారు కాబట్టి పట్టాభికి కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చి వుంటారని రఘురామ ఊహించారా? లేక నిజంగానే కొట్టినా... పట్టాభి బయటకు చెప్పుకోలేదా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. రఘురామ ఆరోపణలపై పట్టాభి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు