చేసిందంతా చేసి ఏమీ తెలియదన్నట్టు నంగనాచి కబుర్లు చెబుతుంటారు. ఇప్పుడా ఆ జాబితాలోకి టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేరిపోయారు. నిజంగా ఘోర పరాజయం తర్వాత జాలి చూపాలని అనిపించే వాళ్లకు ...ఇదో చంద్రబాబు ఇలాంటి మాటలు విన్నప్పుడు అరికాళ్ల దగ్గరి నుంచి మంట పుట్టుకొస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని, ఉత్తరాది రైతులు భారీగా ఢిల్లీకి వెళ్లి నిరసన చేపట్టారు. దీంతో దేశ రాజధాని అట్టుడికిపోతోంది. ఢిల్లీలో రైతుల ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమాన్ని కళ్లప్పగించి సినిమా చూస్తున్నట్టు నటిస్తున్న చంద్రబాబు పదో రోజు అది కూడా ఆచితూచి స్పందించారు. వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని, ఆ చట్టాలపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు కోరారు. ఇక్కడే చంద్రబాబు అతిజాగ్రత్త తీసుకోవడాన్ని గమనించొచ్చు.
ఎక్కడే గానీ మోడీ సర్కార్ను ఒక్క మాట కూడా అనడానికి సాహసించలేదు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలంటున్నారే తప్ప.... వ్యవసాయ చట్టాలు ఎలా ఉన్నాయో తన అభిప్రాయాన్ని మాత్రం స్పష్టం చేయకపోవడాన్ని గమనించొచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ చట్టాలు తీసుకురావడంలో చంద్రబాబు పాపం కూడా ఉంది.
బిల్లులను హడావిడిగా ప్రవేశపెట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని బాబు కోరారు. సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టాల వల్ల అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతులపై మరింత భారం మోపే ప్రమాదం ఉందని బాబు హెచ్చరించారు.
ఈ చట్టాలను కేంద్రప్రభుత్వం లోక్సభ, రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పుడు మాట మాత్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేయకుండా జైకొట్టిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు మాత్రం ఈ చట్టాల వల్ల అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతులపై మరింత భారం మోపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేయడం బాబుకే చెల్లింది.
మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే కాబోలు. ఒకవైపు రైతుల నడ్డివిరిచే బిల్లులకు మద్దతు పలికి, ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడ్డంలో ఔచిత్యం ఏంటో చంద్రబాబే చెప్పాలి. రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసే బిల్లులను ఎందుకు సమర్థించాల్సి వచ్చిందో బాబు సమాధానం చెప్పి తీరాలి. మాటలకు, చేతలకు పొంతన లేకుండా మభ్య పెట్టడం దేని కోసం?
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు