దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సమరోత్సాహంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే ఆయన సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ వెంటనే ముందు నాలుగు విడతల ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత ఎన్నికలను చివరి దశకు వేయడంతో పాటు మిగిలిన మూడు విడతలను ముందుకు జరిపారు. దీంతో రెండో దశ ఎన్నికలు మొదటి దశకు చేరాయి. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ రీషెడ్యూల్ చేశారు.
నిజానికి మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. అయితే ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య గొడవ కారణంగా గందరగోళ పరిస్థితి నెలకుంది. దీంతో నామినేషన్లను స్వీకరించేందుకు ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా లేకపోవడం, సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తుండడంతో ఎన్నికల సంఘం అనుకున్నట్టు జరగలేదు.
ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ శరవేగంతో చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికలకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు