'కోవిడ్ - 19ను ఎదుర్కొనడంలో రాష్ట్రాల అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి, ఈ మహమ్మారిని ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలే సలహాలు ఇవ్వాలి. నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రానికి రాష్ట్రాల సలహాలు ఎంతో ఉపయోగపడతాయి..' ఇదీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్య!
కోవిడ్-19ను ఎదుర్కొనడం, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి మోడీ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనడంలో ఇప్పటి వరకూ భారతదేశం మెరుగ్గానే వ్యవహరించిందని, అయితే అప్పుడే అయిపోలేదని మాత్రం తేల్చి చెప్పారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి వెళ్లకూడదని మోడీ సూచించారు. కరోనా రికవరీ రేటును చూసి నిర్లక్ష్యం పెరుగుతోందని కూడా మోడీ వ్యాఖ్యానించారు!
ఇదీ దేశ ప్రధాని స్పందించిన తీరు. కరోనా పై పోరాటం అప్పుడే అయిపోలేదని ఆయన తేల్చి చెప్పారు. నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. రాష్ట్రాల అభిప్రాయాలు కీలకమైనవి అని, కేంద్రం కూడా వాటిని అనుసరించే నిర్ణయాలు తీసుకుంటుందని మోడీ కుండబద్ధలు కొట్టారు. ఎందుకంటే.. కోవిడ్-19 ను ఆది నుంచి ఎదుర్కొంటున్నది రాష్ట్రాలే.
ఎక్కడిక్కడ ఆయా పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ స్థాయిలో పరీక్షలు జరగడం, మరికొన్ని చోట్ల పరీక్షలు జరగకపోవడం.. ఇవన్నీ కూడా రాష్ట్రాల పరిధిలోని అంశాలే. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కోవిడ్-19 మహమ్మారిపై ఇప్పటికే పూర్తి స్పష్టత వచ్చింది.
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గినట్టుగానే తగ్గి, మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడేం చేయాలి అనేది రాష్ట్రాలకే తెలియాలి అని మోడీ తేల్చి చెప్పారు! అదీ ఈ దేశ ప్రధాన మంత్రి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు ఇస్తున్న విలువ!
ఈ అంశాన్ని ఏపీలో ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలను నిర్వహించేయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాస్త ప్రధాని ఏం చెప్పారో కూడా వింటే సరిపోతుందేమో! .
తమది స్వతంత్ర వ్యవస్థ అని, తాము అనుకున్నట్టుగా చేస్తామనడం బాగానే ఉంది కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాస్త పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయితే అయి ఉండొచ్చు గాక.. అలాగని ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టే హక్కు మాత్రం దానికి లేదు.
రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కీలకమైనవని స్వయంగా ప్రధాని చెప్పిన నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది అనే అంశాన్ని నిమ్మగడ్డ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలా కాకుండా.. ప్రజలెన్నుకున్న ప్రధాని మాటలతో సంబంధం లేదు, ప్రజలెనుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్క లేదు..తనది స్వతంత్ర వ్యవస్థ కాబట్టి, తను అనుకున్నట్టే అని నిమ్మగడ్డ భావిస్తే.. తద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్టు? అనేది ప్రజలు ఆలోచించే అంశం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు