క్రికెట్లో రనౌట్ అత్యంత బాధ కలిగించే విషయం. ఒక రకంగా ఇది జీవితంలో ఆత్మహత్య లాంటిదన్న మాట. రాజకీయాల్లో కూడా హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని ఆ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతుంటారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పొచ్చు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రనౌట్ అయ్యారు. రాజకీయ క్రీడలో ప్రత్యర్థులు పైచేయి సాధించారు. అయితే ఆయన ప్రత్యర్థులు సొంత పార్టీ వారే కావడం గమనార్హం. తాను మాత్రమే తెలివైన వాడినని, మిగిలిన వాళ్లంతా అజ్ఞానులనే భావనతో రఘురామకృష్ణంరాజు దూకుడుగా వ్యవహరించి తగిన మూల్యాన్ని ఒక్కొక్కటిగా చెల్లించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల రూ.826.17 కోట్ల మోసానికి పాల్పడ్డాడని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై సీబీఐ కేసు నమోదు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ కుట్రలు పన్నినారంటూ ఎన్నెన్నో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి కేసు పెట్టించడంలో కీలక పాత్ర పోషించారని రఘురామకృష్ణంరాజు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
సీబీఐ కేసు మరిచిపోకనే మరో పిడుగులాంటి వార్త. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణం రాజును తొలగిస్తూ లోక్సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. ఈ మార్పుచేర్పులు ఈ నెల 9 నుంచే అమల్లోకి వస్తాయని లోక్సబ్ సచివాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.
తన స్థానంలో బాలశౌరిని నియమించేందుకు పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారని, వాళ్ల ప్రయత్నాలు ఫలించవని ఆ మధ్య ఆయన అన్నారు. కానీ రఘురామకృష్ణంరాజు పప్పులుడకలేదు.
రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదు కావడం, అది విచారణ దశలో ఉండడంతో ఆ పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన తొలగింపునకు రాజకీయ అంశాలే కారణమనేది బహిరంగ రహస్యం. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ కోరి కోరి రఘురామకృష్ణంరాజును పార్టీలోకి తెచ్చుకుని, నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చి, గెలిపించుకుని దేశ అత్యున్నత చట్టసభకు పంపింది.
కారణాలేంటో తెలియదు కానీ, వైసీపీలో ఆయన ఇమడ లేకపోయారు. రాష్ట్రంలో సొంత ప్రభుత్వంపైన్నే విమర్శలు ఎక్కు పెట్టారు. పార్టీ నుంచి బయటికి పంపుతారనే ఆశతో, ఓ సెక్షన్ మీడియా అండతో జగన్ సర్కార్పై ఘాటు విమర్శలు గుప్పిస్తు న్నారనే అభిప్రాయాలు బలంగా ప్రచారంలో ఉన్నాయి.
రఘురామకృష్ణంరాజు ఎంత తీవ్ర విమర్శలు చేసినా ...అతనిపై మాత్రం పార్టీ ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రఘురామకృష్ణంరాజుపై వేస్తే అనర్హత వేటు తప్ప మరే ఆలోచన లేదని పార్టీ ముఖ్యనేతలు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణం రాజును తప్పించడం గమనార్హం. నర్సాపురం ఎంపీ తనను ఎన్ని మాటలంటున్నా ... ఏనాడూ జగన్ నోరు తెరవలేదు. జగన్ తన మౌనంతో రఘురామకృష్ణంరాజు స్థానం ఏంటో చెప్పకనే చెప్పారు. అతనికి అంతకంటే జగన్ విధించే శిక్ష ఇంకేం ఉంటుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు