తిరుపతి ఉప ఎన్నికలో గెలుపొందిన అనంతరం డాక్టర్ గురుమూర్తి సీఎం వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు పొందారు. రాజకీయాలకు పూర్తిగా కొత్తైన డాక్టర్ గురుమూర్తికి ఎలా నడుచుకోవాలో హితబోధ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎలా ఉండ కూడదో తమ పార్టీకే చెందిన ఓ ప్రజాప్రతినిధిని ఉదాహరణగా చెప్పినట్టు తెలిసింది.
గతంలో ఆయన ఎంపీగా పని చేస్తున్న క్రమంలో తన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరితో పొసగని విషయాన్ని పరోక్షంగా గురుమూర్తికి చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సదరు ఎమ్మెల్యే వైఖరితో పార్టీకి కంచుకోటలాంటి నియోజక వర్గంలో మెజార్టీ భారీగా తగ్గడంపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలోనే గురుమూర్తికి కొన్ని సూచనలు, సలహాలు జగన్ ఇచ్చారని తెలిసింది.
పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ప్రతి ఎమ్మెల్యేతో సఖ్యతగా మెలగాలని, గ్రూపు రాజకీయాలకు చోటు ఇవ్వకూడదని, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలని గురుమూర్తికి జగన్ స్పష్టంగా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
తోటి ప్రజాప్రతినిధులు, ప్రజలతో కొనసాగించే సంబంధాలపై రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని గమనంలో పెట్టుకోవాలని గురుమూర్తికి జగన్ హితబోధ చేసినట్టు సమాచారం. అందరి ఆకాంక్షలకు తగ్గట్టుగా నడుచుకుంటానని సీఎంకు గురుమూర్తి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు