కేసీఆర్ తో మరో లడాయికి గవర్నరు సిద్ధం!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. కేసిఆర్ ప్రభుత్వంతో మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించడం ద్వారా, క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలను కూడా తిప్పి పంపి వాటి మీద వివరణలు…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. కేసిఆర్ ప్రభుత్వంతో మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరస్కరించడం ద్వారా, క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలను కూడా తిప్పి పంపి వాటి మీద వివరణలు కోరడం ద్వారా.. గతంలో పలుమార్లు సంచలనాలు సృష్టించిన గవర్నర్ తమిళి సై..  తాజాగా గవర్నర్ కోటాలో  ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లలో ఇద్దరిని తమిళిసై తిరస్కరించారు.

క్యాబినెట్ ఆమోదంతో సిఫారసు చేసిన కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాయడం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం ఆ ఇద్దరు  ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేయడానికి  అనర్హులని ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. 

ఆ అధికరణం కింద పేర్కొన్న ఐదు కేటగిరీలలో, ఏ కేటగిరీకి కూడా వారు చెందని తమిళిసై పేర్కొన్నారు. వారిద్దరూ రాజకీయ నాయకులని, అందుచేత గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి అనర్హులని ఆమె పేర్కొన్నారు. కేవలం ఆ ఇద్దరి ప్రొఫైల్ లను మాత్రం పెట్టి.. క్యాబినెట్ సిఫారసు చేసిందని.. వాటిని ఆమోదించేది లేదని తమిళిసై చెప్పడం విశేషం.

ప్రజాప్రతినిధ్య చట్టంలో గవర్నర్ ఎమ్మెల్సీలుగా ఎలాంటి వారిని నామినేట్ చేయాలో, ఎలాంటి వారిని చేయకూడదో చాలా స్పష్టంగా పేర్కొన్నారని.. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి అర్హులైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేక మంది ఉన్నారని గవర్నర్ ప్రస్తావించారు. ఇలా రాజకీయ నాయకులను నామినేట్ చేయడం వలన ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు అవకాశాలను తిరస్కరించినట్లు అవుతుందని ఆమె స్పష్టం చేయడం విశేషం.

గతంలో ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించిన అనేక సందర్భాలలో.. గవర్నర్తో ప్రభుత్వంలోని పెద్దలు లడాయి పెట్టుకున్నారు.  గవర్నర్ మీద మహారాష్ట్రకు చెందిన వారు విమర్శలు కురిపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం సిఫారసు చేసిన కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి తిరస్కరించడం అనేది కీలక పరిణామం అని చెప్పాలి.

గవర్నర్ నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉంటున్నాయని భారాస నాయకులు పలుమార్లు ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి  గవర్నర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. రాజకీయ నాయకులను సిఫారసు చేసినందుకు గవర్నర్ చాలా ధైర్యంగా తిరస్కరించారని ప్రశంసించడం ద్వారా అలాంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నారు.