బీజేపీ సీనియర్ నేత, టాలీవుడ్ కమెడియన్ బాబుమోహన్కు ఆయన కుమారుడు షాక్ ఇచ్చారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బాబుమోహన్ ఆందోల్ నుంచి బీజేపీ తరపున బరిలో నిలిచారు. మొదట ఆందోల్ బీజేపీ టికెట్ బాబుమోహన్ కుమారుడైన ఉదయ్బాబు కుమార్కు ఖరారైందన్న ప్రచారం జరిగింది.
దీంతో బాబుమోహన్ తీవ్ర మనస్తాపం చెందారు. తనకు కాకుండా కుమారుడికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీతనయుల మధ్య గొడవ పెట్టడానికే బీజేపీ అధిష్టానం ఇలా చేస్తోందని మండపడ్డారు. కుమారుడికి టికెట్ ఇచ్చే ఉద్దేశం వుంటే, ఆ విషయాన్ని తనకు చెప్పొచ్చు కదా అని ఆయన అన్నారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే బీజేపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా బాబుమోహన్కే బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తండ్రీతనయుల మధ్య రాజకీయ విభేదాలు అంతకంతకూ పెరిగాయి. తండ్రికి టికెట్ ఇచ్చి, తనను అవమానించారనే అసంతృప్తి బాబు మోహన్ కుమారుడిలో బలంగా వుంది. అదును చూసి బీజేపీని, తన తండ్రిని రాజకీయంగా దెబ్బతీసేందుకు బాబుమోహన్ కుమారుడు సిద్ధమైనట్టు తెలిసింది. బీఆర్ఎస్లో చేరేందుకు ఉదయ్ సిద్ధమయ్యారు.
మంత్రి హరీష్రావు చేతుల మీదుగా ఉదయ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోడానికి ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. బీఆర్ఎస్లో చేరిన తర్వాత తండ్రికి వ్యతిరేకంగా బాబుమోహన్ కుమారుడు ఎన్నికల ప్రచారం చేయనున్నారన్న మాట. రాజకీయాలు తండ్రీతనయుల్ని సైతం వేరుపరుస్తాయనేందుకు మన కళ్లెదుటే నిలువెత్తు సాక్ష్యం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.