ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో మరో రికార్డు నెలకొంది. 21 కేజీల బాలాపూర్ లడ్డూను రూ. 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలకగా, ఈ సారి అంతకంటే ఎక్కువ ధర పలికింది. ఈ లడ్డూ కోసం 36 మంది పోటీ పడ్డారు.
కాగా దయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డూను రెండోసారి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలాపూర్ వినాయకుడికి 43 ఏళ్ల చరిత్ర ఉన్నా.. లడ్డూ వేలం మాత్రం 1994 నుండి కొనసాగుతూ వస్తోంది. మొదటగా అదే గ్రామానికి చెందిన కొలను మోహన్ రెడ్డి కేవలం 450 రూపాలకు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. అప్పటి నుండి ప్రతి ఏడాది వేలంలో రికార్డు ధర పలుకుతోంది. కరోనా కారణంగా 2020లో మాత్రం లడ్డూను వేలం పాట నిర్వహించలేదు.
ఇన్ని లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మొదట భక్తిగా.. తర్వాత సెంటిమెంట్ గా.. తర్వాత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది.. లడ్డూను దక్కించుకునేందుకు బాలాపూర్ గ్రామస్థులే కాదు.. ఇతర ప్రాంతాల వారూ వేలంలో పాల్గొనేందుకు వస్తారు. వేలంలో లడ్డును సొంతం చేసుకున్న వారు స్థానికులైతే.. మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించాల్సిన వెసులుబాటు ఉండగా.. ఇతరులైతే మాత్రం అక్కడికక్కడే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.