సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, తెలంగాణ పిసిసికి గతంలో సారథ్యం వహించిన అనుభవం ఉన్న వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఇప్పుడు రాజకీయ వర్గాలలో ప్రకంపనాలు సృష్టిస్తుంది.
ఒకవైపు ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ఆయన తమ పార్టీలో చేరేట్లయితే, తాను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తుంది.
అదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన వైనం పట్ల, తెలంగాణ పిసిసి సారధి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు ఇంకా తీవ్రంగా ఉంది. రేవంత్ మాటలను గమనిస్తే, పొన్నాల వెండి బిఆర్ఎస్ లో చేరేవరకు, ద్వారా కాంగ్రెస్ మీద నిశిత విమర్శనాస్త్రాలను సంధించే వరకు.. రేవంత్ ఊరుకోరేమో అనిపిస్తుంది.
47 ఏళ్ల పాటు పార్టీలో పదవులు అనుభవించి, చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలి అంటూ.. రేవంత్ రెడ్డి- పొన్నాల లక్ష్మయ్య ను తీవ్ర పదజాలంతో దూషించారు. 2014, 2018 2018లలో ఓడిపోయిన వైనం గుర్తుంచుకోవాలని.. ఇప్పుడు 80 ఏళ్ల వయసులో పార్టీ టికెట్ కోసం ఆరాటపడటం గా అసహ్యంగా ఉందని రేవంత్ ధ్వజమెత్తారు.
ఇన్నాళ్లు పెంచి పోషించిన తల్లి లాంటి పార్టీని దూషించి, రాజీనామా చేసి బయటికి వెళ్లడానికి ఏం రోగం అంటూ నిందించారు. ఇవాళ పొన్నాల లక్ష్మయ్య ను రాష్ట్రంలో ఎవరైనా గుర్తు పడుతున్నారంటే.. అది కేవలం కాంగ్రెస్ పార్టీ చలవ అంటూ.. పరోక్షంగా ఆయనను ఆహ్వానిస్తున్న బిఆర్ఎస్ మీద కూడా చురకలు వేశారు.
కాంగ్రెసులో టికెట్ల ప్రకటనకు పూర్వమే పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసే బయటికి వెళ్లడం అనేది.. చర్చనీయాంశంగా ఉంది. ఢిల్లీలో అభ్యర్థిత్వాల మీద జరుగుతున్న కసరత్తు అంశాలు బయటకు లీక్ అవుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఫైనల్ గా అభ్యర్థి ఎవరో తేల్చకుండా.. మరికొంత కాలం జాప్యం చేయడం ద్వారా, అసంతృప్తులు ఇతర పార్టీలలోకి ఫిరాయించే అవకాశాలకు గండి కొట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నది. అందుకోసమే జాబితా ఒక కొలిక్కి వచ్చినప్పటికీ కూడా.. రాహుల్ గాంధీ పాల్గొనే బస్సు యాత్ర పూర్తయిన తర్వాత మాత్రమే ప్రకటించాలని వారు అనుకుంటున్నారు
కాంగ్రెస్ జాబితాను రహస్యంగా ఉంచుతున్నప్పటికీ.. జనగామ టికెట్ కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఇస్తారనే విషయం బయటకు వచ్చింది. దీంతో అలకపూనిన పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో రేవంత్ రెడ్డి అసహనంతో తీవ్రమైన విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
పొన్నాల లక్ష్మయ్య పార్టీ అధిష్టానాన్ని, ఏదో కాస్త బెదిరించి దానికి రాజీనామా చేసి ఉండినా కూడా, బుజ్జగింపులకు లొంగేవారేమోనని.. ఇప్పుడు రేవంత్ మార్కు దూషణల తర్వాత ఆయన ఖచ్చితంగా వేరే పార్టీలో చేరడం తప్ప గత్యంతరం లేదని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి.