బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ముందుస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలున్నాయని, కావున 15న వచ్చేందుకు అనుమతించాలని ఆమె ఈడీని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. కవిత విన్నపాన్ని ఈడీ కొంత వరకు పరిగణలోకి తీసుకుంది.
విచారణ తేదీని ఈడీ మార్చింది. కవిత కోరుకున్నట్టుగా 15వ తేదీ వరకూ సమయం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సిందిగా ఈడీ కవితకు తెలియజేసింది. దీంతో ఆ రోజు వెళ్లడానికి కవిత సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె వెల్లడించారు.
ఈడీ అధికారులే తమ ఇంటికి రావచ్చని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఒక వేళ ఈడీ ఇంటికి రానంటే తానే ఈడీ అధికారులు ఎదుట హాజరవుతానని ఆమె చెప్పారు. ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారిస్తారని కవిత గుర్తు చేశారు. కుదరక పోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా విచారిస్తారన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే తనను 11వ తేదీ విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలిచారని ఆమె అన్నారు.
మోదీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీని ప్రయోగిస్తోందని కవిత ఆరోపించారు. ఈ ఏడాది చివరల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయని, అందుకే ప్రధాని మోదీ తమను టార్గెట్ చేశారని కవిత ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోదీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్ అని చెప్పారు.