తెలంగాణలో ఖమ్మం జిల్లా రాజకీయాలకో ప్రత్యేకత వుంది. అక్కడ బీఆర్ఎస్ బలహీనంగా వుండడం, కాంగ్రెస్, వామపక్షాలు బలంగా వుండడంతో ఇరువురి మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. టికెట్ ఇవ్వలేదని అలిగి, కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్పై ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావును పిలిచి, మంత్రి పదవి ఇచ్చానని కేసీఆర్ చెప్పారు.
అయితే ఖమ్మం జిల్లాకు తుమ్మల వల్ల కలిగిన ప్రయోజనం శూన్యమని కేసీఆర్ విరుచుకుపడ్డారు. కేసీఆర్కు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి తన భిక్షే అని తుమ్మల ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తుమ్మలకు మంత్రి పువ్వాడ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఇప్పటికే పొలిటికల్ రిటైర్మెంట్ను తుమ్మల ప్రకటించే వారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు మంత్రి పదవి ఇప్పించానని తుమ్మల మాట్లాడ్డం సరైంది కాదన్నారు. తుమ్మల నీచాతినీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన చేతిలో ఓడిపోయిన తుమ్మలకు కేసీఆర్ పిలిచి మంత్రి పదవి ఇచ్చారని మంత్రి అజయ్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తుమ్మల లేరని ఆయన అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు లేనంత మాత్రాన తెలంగాణను సాధించుకోలేదా? అని మంత్రి ప్రశ్నించారు. జై తెలంగాణ అని నినదించిన వారిని జైల్లో పెట్టించిన ఘనత తుమ్మలకే దక్కుతుందని ఆయన విమర్శించారు.