వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో పోటీపై మరోసారి స్పష్టత ఇచ్చారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు షర్మిల ఘన నివాళులర్పించారు. అనంతరం ఆమె పాలేరుకు వెళ్లారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ తర్వాత పలు చానళ్లతో తన రాజకీయ అడుగులపై మనసులో మాటను చెప్పారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తన పార్టీ పోటీ ఖాయమని తేల్చి చెప్పారు. గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నా…పాలేరు నుంచే తాను పోటీ చేస్తానని షర్మిల కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పాలేరు మట్టిసాక్షిగా ఇక్కడి ప్రజలకు వైఎస్సార్ సంక్షేమ పాలన అందిస్తానన్నారు. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు కట్టించి ఇస్తానని చెప్పారు. అలాగే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకొస్తానని షర్మిల హామీ ఇచ్చారు.
మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుందని ధైర్యంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, త్వరలో మళ్లీ పాలేరు నుంచే ప్రారంభించి, 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానని మాటిస్తున్నానని షర్మిల వివరించారు.
దీంతో షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నట్టు స్పష్టమైంది. కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. తన తండ్రికి ట్విటర్ వేదికగా నివాళులర్పించిన రాహుల్గాంధీకి ఆమె కృతజ్ఞతలు చెప్పడం గమనార్హం. షర్మిల ట్వీట్ రకరకాల రాజకీయ అభిప్రాయాలకు కారణమైంది.