ఎన్టీఆర్ పేరు పెట్టే ధైర్యం, తెగింపు జగన్ కే ఉన్నాయి

కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టారని తెగ గింజుకునేవారు టీడీపీ వాళ్లు. ఇప్పటికీ ఈనాడు పేపర్ లో కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లా అని రాయరు. అదే సమయంలో నెల్లూరు జిల్లా…

కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టారని తెగ గింజుకునేవారు టీడీపీ వాళ్లు. ఇప్పటికీ ఈనాడు పేపర్ లో కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లా అని రాయరు. అదే సమయంలో నెల్లూరు జిల్లా పేరు మాత్రం పొట్టి శ్రీరాములు జిల్లా అని రాస్తారు. 

బాబుకి కానీ, బాబు అనుకూల మీడియాకి కానీ కడప అన్నా, వైఎస్ఆర్ అన్నా అంత కడుపుమంట. ఇక ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో కృష్ణాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే పేరు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు మొహం ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందోనని అంటున్నారు నెటిజన్లు.

ఇప్పటి వరకూ ఎన్టీఆర్, చంద్రబాబు. ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ నేతలే అంటుంటారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి పెద్దది చేస్తే.. చంద్రబాబు ఆ గూటిలోకి వచ్చి చివరకు ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి పదవుల్ని అనుభవించారు. కనీసం ఎన్టీఆర్ కుటుంబానికి కూడా తర్వాతి జనరేషన్లో అవకాశం లేకుండా చేశారు. 

ఇప్పుడు తన కొడుకుని వారసుడిగా చేస్తున్నారు. కేవలం అవసరానికి ఎన్టీఆర్ పేరు పలుకుతారు కానీ, చంద్రబాబుకి ఎన్టీఆర్ అనే పేరంటేనే ఎక్కడలేని జలసీ, అభద్రతా భావం. అందుకే ఇప్పుడు టీడీపీలో నందమూరి ఆత్మ లేదు, ఉన్నదంతా నారావారి పరమాత్మలే.

ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అసలు డిమాండ్ గానే మిగిలిపోవడానికి కారణం ఎవరు, కేవలం చంద్రబాబే. తాను అధికారంలో ఉన్నప్పుడు, తన మద్దతుతో ఉన్న పార్టీలు కేంద్రంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎప్పుడూ ఆ అంశం గుర్తు రాదు. తన రాజకీయ అవసరాలకి మాత్రమే అది గుర్తొస్తుంది. పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కి కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి కనీసం ఎన్టీఆర్ పేరుని ఓ జిల్లాకు పెట్టాలనే ఆసక్తి అయినా ఉందా అంటే అదీ లేదు.

కానీ జగన్ ఆ పని చేసి చూపిస్తున్నారు. తమకు ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరుని జిల్లాల విభజన తర్వాత కృష్ణా జిల్లాకు పెట్టబోతున్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు గాలికొదిలేస్తే.. పేదల సంక్షేమం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో వాటిని జగన్ కొనసాగించడం నిజంగా అభినందనీయం. ఏపీ చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రుల్లో ముందుగా ఎన్టీఆర్ పేరు వినపడితే ఆ తర్వాత ఆ స్థాయిలో జనాదరణ పొందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు వారిద్దరినీ ప్రజాదరణలో మించిపోతున్నారు జగన్. అందుకే జగన్ అంటే బాబుకి అక్కసు.

ఇప్పుడు కృష్ణాజిల్లా పేరుని ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తుండే సరికి బాబుకి ఏం చేయాలో పాలుపోవడంలేదు. టీడీపీ వ్యవస్థాపకుడికి జగన్ ఇచ్చే గౌరవం బాబుకి మింగుడు పడటం లేదు, తన హయాంలో ఆ పని చేయలేనందుకు సిగ్గుతో చితికిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు.