రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టండి

రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన…

రామాయపట్నంలో భారీ పోర్టు నిర్మాణం పనులను సత్వరమే ప్రారంభించాలని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో మేజర్‌ పోర్టు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలి. అయితే దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం లాభదాయకం కాదని తేలిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వి.విజయసాయి రెడ్డి చెప్పారు.

రామాయపట్నం పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాకు అనువైనదిగా గుర్తింపు పొందినట్లు ఆయన తెలిపారు. బంగాళాఖాతం తీరం హద్దుగా ఉన్న దేశాలలో నౌకాశ్రాయల నిర్మాణంపై ఇటీవల జరిగిన బిమ్‌స్టెక్‌ అంతర్జాతీయ సదస్సు సైతం రామాయపట్నం పోర్టు ఆవశ్యకతను ప్రసావించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. బిమ్‌స్టెక్‌ దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలపై రామాయపట్నం పోర్టు ప్రభావం గురించి ఈ సదస్సులో చర్చ జరిగినట్లు చెప్పారు. ఈ పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్‌ పోర్టు నిర్మాణానికి అనుమతులు సాధించడానికి బదులుగా గత ప్రభుత్వం రామాయపట్నంలో సొంతంగానే నాన్‌-మేజర్‌ పోర్టు నిర్మించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. కానీ నేటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. రామాయపట్నంలో నాన్‌-మేజర్‌ పోర్టు స్థానంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు మేజర్‌ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుచేస్తే రాష్ట్ర ప్రభఉత్వమే పోర్టునిర్మాణ బాధ్యతలను చేపట్టి త్వరితిగతిన పూర్తి చేస్తుందని అన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు.

మేజర్‌ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రామాయపట్నంలో 3 వేల ఎకరాల భూమిని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికే అయిదేళ్ళు పూర్తయినా రామాయపట్నం పోర్టు నిర్మాణం హామీని నెరవేర్చమంటూ ఇప్పటికీ  మేము పార్లమెంటులో గొంతెత్తి అరవవలసి రావడం దురదృష్టకరమని అన్నారు. పోర్టు ప్రాజెక్ట్‌ ప్రక్రియను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం  త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేసేందుకు వీలుగా నిధులు మంజూరు చేయవలసిందిగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఆడిట్ పూర్తయిన తర్వాతే పోలవరంకు నిధులు  
పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 3,222.75 కోట్ల రూపాయలను విడుదల చేయవలసిందిగా  రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా అంటూ సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో  వి.విజయసాయి రెడ్డి కేంద్ర జల శక్తి మంత్రి  గజేంద్ర షెకావత్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించడానికి ముందు చేసిన 5 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఆడిట్‌ జరుపుతోంది. ఇప్పటి వరకు 3 వేల కోట్ల మేరకు ఆడిట్‌ పూర్తయినందున అందులో కొంత మొత్తం విడుదల చేసే అంశం ప్రస్తుతానికి ఆర్థిక శాఖ పరిశీలినలో ఉన్నట్లు చెప్పారు.

సున్నపు రాయి రాయల్టీ ద్వారానే అత్యధిక ఆదాయం 
ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నప్పటికీ సున్నపు రాయి తవ్వకాలపైనే రాష్ట్రానికి రాయల్టీ కింద అత్యధిక ఆదాయ సమకూరుతున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ వివిధ కనిజ నిక్షేపాల తవ్వకాలపై గడచిన మూడేళ్ళలో రాయల్టీ కింద సమకూరిన ఆదాయ వివరాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని చెప్పారు. ఈ ఖనిజ నిక్షేపాలలో బొగ్గు, లిగ్నైట్‌, ఇసుక ఇతర చిన్నపాటి వాటిని మినహాయిస్తే సున్నపు రాయి తవ్వకాలపై రాయల్టీ కింద 2019-19లో రాష్ట్ర ప్రభుత్వానికి 3883 కోట్ల రూపాయలు ఆదాయం లభించినట్లు ఆయన తెలిపారు.