విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయడం తధ్యమని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో కుండబద్ధలు కొట్టారు. అంతే ఆ తరువాత వేగంగా విశాఖలో పరిణామాలు మారిపోయాయి.
విశాఖ ఉక్కుని దక్కించుకోవాలని నెల రోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మిక లోకం ఉప్పెనలా ఎగిసిపడింది. జాతీయ రహదారినే నిర్భంధించి రాత్రి నుంచి అక్కడే కూర్చుండిపోయారు. ఇక ఏకంగా ఉక్కు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముట్టడికి కూడా కార్మిక సంఘాలు దిగిపోయాయి.
ఈ నేపధ్యంలో చూస్తే ఉక్కు సీఎండీ పీకే రధ్, డైరెక్టర్ పర్సనల్ కెసి దాస్ రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఒడిషాకు చెందినవారు. వీరికి ప్రైవేటీకరణ గురించి పూర్తి సమాచారం ఉందని కార్మికులు అనుమానిస్తున్నారు.
అంతకు మించి ఒడిషా రాష్ట్రానికి చెందిన కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి వీరు అత్యంత సన్నిహితులు అని ప్రచారంలో ఉందిట. ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటనతో కార్మికులు తమ ఆఫీస్ పైకి దూసుకువస్తారన్న సమాచారం ఉండంతోనే వీరు ఢిల్లీకి వెళ్లారు అంటున్నారు.
అదే సమయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ మాత్రం ఆందోళనకారులకు దొరికిపోయారు. ఆయన కారును అడ్డగించి కార్మికులు తన తీవ్ర నిరశనను వ్యక్తం చేశారు. మొత్తానికి ఉక్కు జ్వాలాలు పెద్ద ఎత్తున ఎగిగిపడడంతో ఉక్కు లాంటి అధికారులు సైతం ఇపుడు తప్పించుకుని తిరుగుతున్నారు అంటున్నారు.