జనసేన ఉన్నంత వరకూ అధికార పక్షమైన వైసీపీకి ఆ అవకాశం ఏ మాత్రం దక్కదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకూ ఆ అవకాశం ఏంటో తెలుసుకుందాం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఏపీ రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఏపీ బంద్లో బీజేపీ, జనసేన మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
ఈ నేపథ్యంలో తామెక్కడ ఏపీ వ్యతిరేక పార్టీగా ముద్రపడతామోనని జనసేనాని పవన్కల్యాణ్ ఆందోళన చెందుతున్నారు. దీంతో తమపై వ్యతిరేకతను కాస్తా ఏపీ అధికార పార్టీ వైసీపీపై మళ్లించేందుకు ఆయన తంటాలు పడుతున్నారు. దీంతో ఆయన తాజాగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి స్పందించారు.
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేస్తున్న డ్రామాలుగా పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 22 మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం ఢిల్లీలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా తమ వాణిని వినిపించాలన్నారు. అలా కాకుండా కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లకోసం రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితి లేదని పవన్కల్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక్క వైజాగ్ స్టీల్ప్లాంట్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన తీసుకురాలేదని ఆయన కేంద్రాన్ని వెనకేసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వసంస్థలు, పరిశ్రమలు నడపడంలో వస్తున్న ఒడిదొడుకులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై పవన్ తాజా ప్రకటనపై నెటిజన్లు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామాలు ఆడాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయినా డ్రామాలు వేయడంలో పేటెంట్ కలిగిన జనసేనాని ఉండగా, ఇక ఆ అవకాశం వైసీపీకి ఎలా వస్తుందని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ జనాన్ని మభ్య పెట్టే పనులకు పవన్కల్యాణ్ పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ స్టీల్ను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని నిలదీయాల్సింది పోయి… వెనకేసుకు రావడం ఒక్క పవన్కే చెల్లిందనే కామెంట్స్ వస్తున్నాయి. చివరికి ఏపీ ద్రోహిగా పవన్కల్యాణ్ చరిత్రలో నిలిచిపోతారనే హెచ్చరికతో కూడా కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష మవుతున్నాయి.