Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 4

నవంబరు 20 న రాజపక్షతో కలిసి విందారగించిన మైత్రీపాల మర్నాడు పొద్దున్నకల్లా ''ఈ దేశపు ఆర్థికవ్యవస్థను, సాంఘికవ్యవస్థను ఒకే ఒక్క కుటుంబం శాసిస్తోంది. అందుకే బయటకు వచ్చేశా..'' అన్నాడు. ''వెన్నుపోటుదారులు యిలాగే వుంటారు'' అన్నాడు రాజపక్ష. విభీషణుడితో పోలిక తేలేదు, తను రావణుడు అనుకుంటారని, అంతిమంగా ఓడిపోతానని అనుకుంటారనీ! పోలీసు వ్యవస్థపై యింత పట్టు బిగించినా, తన వీపు వెనక్కాల యింత కుట్ర జరగడం అతను హరాయించుకోలేక పోయాడు. మైత్రీపాలతో బాటుగా ఐదుగురు ఎంపీలు కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఒకరొకరుగా చాలామంది మంత్రులు కూడా.. ! అందర్నీ రాజపక్ష పార్టీలోంచి బహిష్కరించాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి న్యూ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎన్‌డిఎఫ్‌) ఏర్పరచారు. ఈ కూటమిలో రైటిస్టు భావాలున్న యుఎన్‌పి, మార్క్సిస్ట్‌ భావాలు కల జెవిపి, బౌద్ధ సన్యాసులు నడిపే జెఎచ్‌యు, రెండు ముస్లిము పార్టీలు, తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ - లాటి భిన్న దృక్పథాలున్న పార్టీలున్నాయి. 

ఇంతమంది కలిసినా రాజపక్షపై విన్నింగ్‌ మార్జిన్‌ 3.7% మాత్రమే (81.5% పోలింగు జరగగా మైత్రీపాలకు 51.28%కు వచ్చి 12 ఎలక్టొరల్‌ జిల్లాలలో నెగ్గగా రాగా, రాజపక్షకు 47.58% వచ్చి 10 జిల్లాలలో నెగ్గాడు) అంటే రాజపక్ష ఎంత బలంగా పాతుకుపోయాడో చూడండి. 2010 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలలో అతని యుపిఎఫ్‌ఏకు 60.33% ఓట్లు, 225 సీట్లలో 160 సీట్లు వచ్చాయి. అతని కూటమిలో సిలోన్‌ వర్కర్స్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, లంక సమ సమాజ పార్టీ, నేషనల్‌ ఫ్రీడమ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌, అప్‌ కంట్రీ పీపుల్స్‌ ఫ్రంట్‌ యిలా అనేకానేక పార్టీలున్నాయి. బోధుబలసేన మద్దతు ఎలాగూ వుంది. నవంబరు 18న జాతిక హేలా ఉరుమాయ అనే పార్టీ రాజపక్ష కూటమినుండి అతను పాలనా సంస్కరణలు చేపట్టటం లేదన్న అభియోగంతో బయటకు వచ్చేట్లా చేశారు. 2014 డిసెంబరు 8 నామినేషన్ల దినం కాగా అదే రోజున యిద్దరు ప్రతిపక్షాల ఎంపీలు రాజపక్షవైపు ఫిరాయించారు. వారిలో ఒకరిని రాజపక్ష మైత్రీసేన స్థానంలో ఆరోగ్యమంత్రిగా నియమించాడు. డిసెంబరు 23 న ప్రభుత్వపక్షం నుండి శ్రీలంక ముస్లిమ్‌ కాంగ్రెస్‌, ఆల్‌ సిలోన్‌ ముస్లిమ్‌ కాంగ్రెస్‌ అనే పార్టీలు బౌద్ధుల దాడుల నుంచి ముస్లిములకు రక్షణ కల్పించడం లేదన్న ఆరోపణతో ప్రతిపక్షంవైపు ఫిరాయించారు. 

ఇలాటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ఎలా సాగిందో, ఏయే సేనలు ఎటు మోహరించాయో గమనించడం ఆసక్తికరంగా వుంటుంది. రాజపక్ష అంటే మైనారిటీలకు, తమిళులకు అసహ్యం కాబట్టి జనాభాలో వాళ్లు 25% కాబట్టి, వాళ్లకు నచ్చేట్లా వాగ్దానాలు గుప్పిస్తే ఓట్లు కురుస్తాయని మైత్రీసేన అనుకోలేదు. ఎందుకంటే తమిళ టైగర్లను అణిచేసిన చరిత్ర అతనికీ వుంది. అందువలన 2009 నాటి యుద్ధనేరాలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలన్న కోరికకు తల వొగ్గలేదు. అలాగే ముస్లిము, క్రైస్తవులపై దాడుల గురించి విచారణ జరిపిస్తాననీ అనలేదు. మెజారిటీ బౌద్ధులను, సింహళీయులకు నచ్చేట్లా బౌద్ధమతానికి రాజ్యాంగరీత్యా ప్రముఖస్థానాన్ని కొనసాగిస్తానని హామీ యిచ్చాడు. ఆ విధంగా అతను రాజపక్ష ఓటుబ్యాంకులోకి చొరబడి అన్ని మతాలకు చెందిన సింహళ ఓట్లను కొల్లగొట్టాడు. మధ్య, దక్షిణ ప్రాంతాలలో ఆధిక్యత సంపాదించాడు. రాజపక్షకు గ్రామీణ ప్రాంతాలలో, సింహళ-బౌద్ధులున్న దక్షిణాగ్ర శ్రీలంకలో, ఆధిక్యత వచ్చింది. అక్కడ రాజపక్షకు 2% ఎక్కువ ఓట్లు రాగా, ఉత్తరాన, తూర్పున వున్న తమిళ, ముస్లిం ఓట్లు మైత్రీసేనకు తోడయ్యాయి కాబట్టి అతను రాజపక్ష కంటె కొద్దిపాటి మొగ్గు సంపాదించి నెగ్గేశాడు. హింసకు, వివక్షతకు, నిరుద్యోగానికి గురైన మైనారిటీలు, తమిళులు కసితో బూతుల వద్ద బారులు తీరి మైత్రీసేనకు విజయం కట్టబెట్టారు. 2010 ఎన్నికలలో రాజపక్ష ఎన్నిక కచ్చితం అని తెలుసు కాబట్టి అప్పుడు తమిళులు ఎన్నికల పట్ల ఆసక్తి చూపలేదు. ఎవరు కారణమో తెలియదు కానీ ఎన్నికల రోజున తమిళ ప్రాంతాలైన పాయింట్‌ పెడ్రో, వావూనియాలలో బాంబులు పేలాలి. తమను భయపెట్టి బూతులకు దూరంగా వుంచాలనే ప్రయత్నమే అనుకుని తమిళులు మరింత పట్టుదలతో ఓట్లేయడానికి వచ్చారు. మైత్రీసేన అక్కడకు ప్రచారానికి రాకపోయినా రికార్డు స్థాయిలో 68% పోలింగు జరిగింది. 

ఎన్నికలకు ముందుగా రాజపక్ష యిచ్చిన తాయిలాలను విమర్శించాలో లేదో ప్రతిపక్షం తేల్చుకోలేకపోయింది. వద్దంటే ఆ యా వర్గాలకు కోపం వస్తుందని భయం. ప్రభుత్వం 55 బిలియన్‌ డాలర్ల అప్పులో కూరుకుపోయిందని మాత్రం నిందిస్తూనే తాము అధికారంలోకి వస్తే అవన్నీ కొనసాగిస్తాయని హామీ యిస్తూ ఆ మాటకొస్తే పబ్లిక్‌ సెక్టార్‌లో జీతాలను 5000 పెంచుతాయని కూడా చెప్పింది. అవన్నీ యిప్పుడు ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి. వీళ్లు ఏం చెప్పినా ప్రభుత్వసాయంపై ఆధారపడిన సింహళ గ్రామీణ పేదలు రాజపక్షకే ఓటేశారు. సింహళీయుల్లో బౌద్ధులు, ధనికులు కూడా అతనికే ఓటేశారు. కొలంబోలోని నగరప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లోని జనాభా 2010లో రాజపక్షకు ఓటేయగా, యీసారి అతనికి వ్యతిరేకంగా వేశారు. ఎందుకంటే అక్కడ వున్నవారిలో సింహళ, తమిళ భాషల క్రైస్తవులు, తమిళ హిందువులు, ముస్లిములు ఎక్కువగా వున్నారు. సమాజంలోని విద్యావంతులు, ఎకడమీషియన్లు, కార్మికనాయకులు, లెఫ్టిస్టులు, కళాకారులు, హక్కుల ఉద్యమకారులు అందరూ ఎక్కడున్నా సరే రాజపక్షకు వ్యతిరేకమయ్యారు. 

రాజపక్ష ప్రచారంలో భాగంగా 26 ఏళ్ల పాటు తమిళ టైగర్ల వలన దేశం అంతర్యుద్ధంలో ఎలా నాశనమైందో గుర్తుకు తెచ్చుకోండి అంటూ రేడియో, టీవీ స్లాట్‌ల ద్వారా మోగించేశారు. రాజపక్ష కారణంగానే శాంతి నెలకొంది, అతన్ని దింపేస్తే మళ్లీ అశాంతే అనే అర్థంలో తమిళ, సింహళ, ఇంగ్లీషు భాషలో పత్రికలలో యాడ్స్‌ గుప్పించారు. మైత్రీపాలను 'ఈలమిస్టు'గా 'ఎలిట్‌' (కులీనవర్గాల) ప్రతినిథిగా చూపిస్తూ తనను గ్రామీణ ప్రాంతాల ఛాంపియన్‌గా చిత్రీకరించుకున్నాడు. జాతిపరమైన మైనారిటీలు మొత్తం 22% మందే వున్నారు కాబట్టి, యీ రకమైన విభజన ద్వారా మెజారిటీ ప్రజల మద్దతుతో తను గెలవవచ్చని అతని లెక్క. కానీ అది తప్పింది. మైత్రీసేన నెగ్గాడు. ఇప్పుడు మైత్రీసేన ముందున్న సవాళ్లేమిటో చూద్దాం. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?