గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగం.. ఆహాఓహో!

ప్ర‌భుత్వం త‌న భుజాల్ని తానే శ‌భాష్ అని త‌ట్టడుచుకున్న‌ట్టుగా వుంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

ఏపీ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్‌న‌జీర్ ప్ర‌సంగం… ప్ర‌భుత్వ పాల‌నా రీతుల్ని ప్ర‌తిబింబించింది. ప్ర‌సంగం ఆసాంతం ప్ర‌య‌త్నిస్తున్నాం, చేస్తున్నాం, ల‌క్ష్యంగా పెట్టుకున్నాం లాంటి ప‌దాలే ఎక్కువ‌గా వినిపించాయి. తొమ్మిది నెల‌ల పాల‌న‌ను త్వ‌ర‌లో కూట‌మి స‌ర్కార్ పూర్తి చేసుకోనుంది. ఈ నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌టిసారి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది.

బ‌డ్జెట్‌లో సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల‌కు నిధుల కేటాయింపు వుంటుందా? అని ల‌బ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఎలాంటి వాటికి బ‌డ్జెట్ కేటాయింపులు వుంటాయి? అలాగే ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లేంటో అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో మ‌రోసారి గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. గ‌త ప్ర‌భుత్వ త‌ప్పిదాల వ‌ల్లే ప్ర‌స్తుతం తాము ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌నే సంకేతాలు తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ప్ర‌తిబింబించింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ముఖ్య అంశాలేంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు మా కూట‌మి(టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీకి)కి తిరుగులేని విధంగా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. అన్ని అంశాల్లోనూ వైసీపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని గ‌త ప్ర‌భుత్వం ఆర్థికంగా విధ్వంసం చేసింద‌న్నారు. ఇప్ప‌టికే ఆర్థిక ప‌రిస్థితిపై ఏడు శ్వేత ప‌త్రాల్ని విడుద‌ల చేశామ‌ని ప్ర‌భుత్వ మ‌న‌సును ఆయ‌న ఆవిష్క‌రించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. అన్నా క్యాంటీన్ల‌ను తీసుకొచ్చి పేద‌ల ఆక‌లి తీరుస్తున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగాన్ని చ‌దివారు.

పింఛ‌న్ సొమ్మును రూ.4 వేల‌కు పెంచామ‌న్నారు. ప్ర‌తినెలా ఒక‌టో తేదీనే పింఛ‌న్ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి అంద‌జేస్తున్నామ‌న్నారు. అలాగే త‌మ పాల‌న‌లో త‌ల‌స‌రి ఆదాయం పెరిగింద‌న్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను అందిస్తున్నామ‌న్నారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించామ‌న్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామ‌న్నారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామ‌న్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామ‌న్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేసిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించ‌డం గ‌మ‌నార్హం. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్‌ అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఐటీ నుంచి ఏఐ వ‌ర‌కూ సాంకేతిక విప్ల‌వం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ పాల‌న సాగుతోంద‌న్నారు.

2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల్ని పెంచేందుకు పీ4 విధానాన్ని అనుస‌రిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు. విద్య‌, ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ ద్వారా ప్ర‌భుత్వం చెప్పించింది. అలాగే ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వర్గంలో 100 ప‌డ‌కల ఆస్ప‌త్రి నిర్మాణం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని తీసుకొస్తున్నామ‌న్నారు. అలాగే మొట్ట‌మొద‌టిసారిగా నైపుణ్య గ‌ణ‌న చేప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తి ఇంట్లో ఒక వ్యాపార‌వేత్త‌ను త‌యారు చేయ‌డమే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు.

2027 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతిని పోల‌వ‌రంతో అనుసంధానం చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్‌తో రాయ‌ల‌సీమ సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. హంద్రీ-నీవా సుజ‌ల స్ర‌వంతి ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌న్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ 75 శాతం పూర్తైంద‌న్నారు. ఒక్క ఎక‌రా కూడా నిరుప‌యోగంగా ఉండ‌కూడ‌ద‌న్న‌దే ప్ర‌భుత్వ ఆశ‌యంగా చెప్పుకొచ్చారు.

4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లను మంజూరు చేశామ‌న్నారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై దృష్టి సారించామ‌న్నారు. 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ చేయ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు.

ఇందులో పింఛ‌న్ల‌ను పెంచ‌డం, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ర‌కూ నిజాలున్నాయి. అలాగే డీఎస్సీని నిర్వ‌హిస్తామ‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించారు. చంద్ర‌బాబు సీఎంగా మొద‌టి ఫైల్‌పై సంత‌కం చేసింది కూడా దీనిపైనే. ఇంత వ‌ర‌కూ అతీగ‌తీ లేద‌న్న‌ది వాస్త‌వం. ఇక ఏడాదికి మూడు గ్యాస్ సిలిండ‌ర్లు ఇస్తున్నామ‌న్న విష‌యంలో 25 శాతం మాత్ర‌మే నిజం. ఎందుకంటే , ఏడాదిలో కేవ‌లం ఒక సిలిండ‌ర్‌తో స‌రిపెట్టి, ఏడాది అంతా ఇచ్చిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్‌తో చెప్పించారు.

ఇక చేస్తాం, ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్ప‌డానికే ఈ ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం విన్న త‌ర్వాత ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. ప్ర‌భుత్వం త‌న భుజాల్ని తానే శ‌భాష్ అని త‌ట్టడుచుకున్న‌ట్టుగా వుంద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. మొత్తానికి కూట‌మి స‌ర్కార్ గ‌వ‌ర్న‌ర్ ద్వారా ఆహాఓహో అని త‌న పాల‌న గురించి గొప్ప‌లు చెప్పుకుంద‌న్న విమ‌ర్శ అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తోంది.

3 Replies to “గ‌వ‌ర్న‌ర్ బ‌డ్జెట్ ప్ర‌సంగం.. ఆహాఓహో!”

Comments are closed.