విదేశాల్లో చదువుకుని సొంత ప్రాంతంలో రాజకీయం చేద్దామని వచ్చిన వారు కిమిడి నాగార్జున. ఆయన తల్లి కిమిడి మృణాళిని మంత్రిగా పనిచేశారు. తండ్రి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద నాన్న కిమిడి కళా వెంకట్రావు దిగ్గజ రాజకీయ నేత.
ఇలా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాగార్జునకు 2019లో అనూహ్యంగా చీపురుపల్లి టికెట్ దక్కింది. 2024లో మాత్రం పెదనాన్నకు చివరి నిముషంలో అడ్జస్ట్ చేసి పక్కన పెట్టేశారు. దాంతో రాజకీయంగా ఎంతో అప్ సెట్ అయ్యారు యువనేత. యువతను రాజకీయాల్లోకి రావద్దు అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.
అయితే ఆయనకు తగిన పదవులు ఇస్తామని పార్టీ ముందు అధికారంలోకి రావాలని హైకమాండ్ బుజ్జగించడంతో మనస్పూర్తిగా సహకరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా ఇప్పటిదాకా అధికార హోదా అయితే దక్కలేదు.
దీంతో నాగార్జున అనుచరులు అభిమానులు అంతా తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఆ మధ్య ఎమ్మెల్సీ పదవుల పంపిణీ జరిగితే ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు తాజాగా నామినేటెడ్ పదవుల పంపిణీలో నాగార్జునకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి లభించింది.
ఈ పదవితో ఆయనకు టీడీపీ న్యాయం చేసినట్లే అని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి కానీ ఇంకా కీలకమైన స్థానం కానీ ఆయన అనుచరులు ఆశించారు. అయితే మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో అన్నీ సర్దుబాటు చేసుకోవాలి అయినా నాగార్జునకు ఇది మంచి పదవి అని అంటున్నారు. దీంతో ఆయన రాజకీయ జీవితంలో అధికార హోదా స్టార్ట్ అయింది అంటున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది కీలక నేతలు పెద్ద నాయకులుగా ఎదిగిన వారి తొలి అడుగు ఇక్కడే మొదలైంది అని అంటున్నారు.