టార్గెట్ బీఆర్ నాయుడు!

టీటీడీలో ఛైర్మన్‌కు, ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరులో టీటీడీ పలుచనవుతోంది. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోంది. చీ

టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడుకు, ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే వుంది. ఉద్యోగులను పావులుగా చేసుకుని, చైర్మన్‌ టార్గెట్‌గా ఉన్న‌తాధికారులు పావులు కదుపుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. సాధ్యమైనంత త్వరగా నాయుడిని ఇంటిదారి పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ చిరు ఉద్యోగిని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ దూషించిన ఉదంతం నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఒక న్యూస్ చానెల్‌ అధినేత అయిన బీఆర్ నాయుడికి ఏ ర‌కంగా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కిందో అంద‌రికీ తెలుసు. టీటీడీలో తన పెత్తనం చెలాయించాలనుకున్న బీఆర్‌ నాయుడికి తొలి నుంచే ఈవో శ్వామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. ఇది అంతర్గత విభేదాలకు కారణమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్తుల తొక్కిసలాట ఘటనతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఎదుటే ఈవో, చైర్మన్ వాదులాడుకోవడం, ఏకవచనంతో మాట్లాడుకోవడంతో ఈ గొడవలు బహిర్గతమయ్యాయి. ఆ తరువాత ఒకసారి చైర్మన్‌, ఈవో సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఐక్యతా రాగం ఆలపించినా, అది ఉత్తుత్తిదేనని త్వరలోనే తేలిపోయింది.

ఇక తాజా ఘటనకు వస్తే…నరేష్‌ కుమార్‌ అనే బోర్డు సభ్యుడు శ్రీవారి ఆలయంలోనే ఓ చిరు ఉద్యోగిపై చిందులు తొక్కుతూ బూతుపురాణం అందుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతంతో టీటీడీ పరువు బజారుకెక్కిందని శ్రీవారి భక్తులు మదనపడుతుంటే…. ఉన్నతాధికారులు మాత్రం ఛైర్మన్‌ బీఆర్ నాయుడిని టార్గెట్‌ చేయడానికి వినియోగించుకున్నారనే వాద‌న‌ను కొట్టి పారేయ‌లేం.

ఘటన జరిగిన వెంటనే…తమకు అనుకూలంగా వున్న కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను ఉసుగొల్పి, టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనదాకా తీసుకెళ్లడం వెనుక అదృశ్య శ‌క్తులున్నాయ‌ని బీఆర్ నాయుడి అనుమానం. ఇందులో ప్రధానంగా చీర్ల కిరణ్‌ అనే ఉద్యోగ సంఘం నాయకుడున్న‌ట్టు చైర్మ‌న్‌తో పాటు ఆయ‌న సంబంధీకులు అనుమానిస్తున్నారు. ఈ చీర్ల కిరణ్‌ మొన్నటి దాకా అంటే వైసీపీ అధికారంలో ఉన్నంత వ‌ర‌కూ ఆ పార్టీ నేతలతో అంటకాగారు. అప్పటి టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అంత‌రంగ‌కుడిగా వ్యవహరిస్తూ, టీటీడీలో పెత్తనం చేశారు.

టీటీడీ చైర్మ‌న్‌గా భూమ‌న నియ‌మితులై, మొద‌టిసారిగా తిరుప‌తి విమానాశ్ర‌యానికి చేరుకుంటున్న సంగ‌తి ఒక్క చీర్ల కిర‌ణ్‌కే తెలుసంటే వాళ్ల బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. వైసీపీ నాయ‌కులెవ‌రికీ తెలియ‌ని సంగ‌తి చీర్ల కిర‌ణ్‌కు తెలిసి, విమానాశ్ర‌యంలో స్వాగ‌తం ప‌ల‌క‌డానికి ప్ర‌త్యేకంగా చీర్ల కిర‌ణ్ ఏర్పాట్లు చేశార‌ని కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు గుర్తు చేస్తున్నారు. అలాగే ఎన్నిక‌ల కోడ్ వుండ‌గా, గంగ‌జాత‌ర‌లో భూమ‌నతో చీర్ల కిర‌ణ్ అంట‌కాగ‌డాన్ని ఎలా చూడాల‌న్నది ..వాళ్ల ఊహాశ‌క్తికే విడిచిపెడ‌దాం.

అదే విధంగా అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఏది చెబితే అది చేస్తూ వచ్చారు. ధర్మారెడ్డిపై ఏవైనా విమర్శలు వస్తే, వాటికి ఈ చీర్ల కిరణే జవాబు ఇస్తూ వచ్చారు.

అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చీర్ల కిరణ్‌ ఆ పార్టీ నేతలకు దగ్గరయ్యారు. తన సామాజికవర్గంతో పాటు, జనసేన అధినేత పవన్‌కు గురువులాంటి వాడైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో వున్న సంబంధాలతో సులభంగా ఆ పార్టీకి దగ్గరై, టీటీడీలో చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు చీర్ల కిరణ్‌ గురించి ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నరేష్‌ కుమార్‌ వివాదంపై మొదటగా స్పందించింది ఆయనే. బోర్డు స‌భ్యుడు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చ‌రించారు. మిగతా సంఘాల నేతలను రెచ్చగొట్టి, ధర్నా చేయించారని బీఆర్ నాయుడు ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలిసింది. ఆ తరువాత ఈవో, అదనపు ఈవోల సమక్షంలో నరేష్‌ కుమార్‌తో సారీ చెప్పించారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కడా టీటీడీ చైర్మన్‌ ప్రస్తావన కనిపించదు. ఇంత జరుగుతున్నా చైర్మన్‌ పట్టించుకోలేదన్న భావనను ప్రభుత్వంలో కల్పించి, సాధ్యమైనంత త్వరగా ఆయన్ను ఇంటిదారి పట్టించడానికి కుట్రలు పన్నుతున్నారని చైర్మన్‌ అనుకూల వర్గం చెబుతోంది.

ఈవో, అదనపు ఈవో తలచుకుని వుంటే ఈ వివాదం ఆందోళన దాకా వెళ్లేది కాదు. అయినా చైర్మన్‌ మీద వున్న కోపంతో, తమకు అనుకూలంగా వున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతల సహకారంతో టీటీడీలో అలజడి సృష్టించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్‌ వుండేది రెండేళ్లే…అధికారులు ఎంతకాలమైనా వుంటారు అనే అభిప్రాయంతో చీర్ల కిరణ్‌ వంటి ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో కలిసి, చైర్మన్‌కు వ్యతిరేకంగా మంత్రాంగం నడిపారన్న అభిప్రాయం టీటీడీ ఉద్యోగుల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. చర్చలతో పరిష్కరించుకోవాల్సిన వివాదాన్ని ధర్నా దాకా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన చీర్ల కిరణ్‌, ఇప్పటికీ వైసీపీ నేత‌ల‌తో అంటకాగుతున్నారని, ఆ పార్టీ నేతలలో సన్నిహితంగా వుంటున్నారని టీటీడీ చైర్మన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విష‌యంలో చైర్మ‌న్ అభిప్రాయం స‌రైందో.

టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్‌తో చీర్ల నిత్యం ట‌చ్‌లో వుంటార‌ని, చీక‌ట్లో క‌లుస్తుంటార‌ని చైర్మ‌న్‌కు ఉద్యోగ సంఘాల నేత‌లు ఉప్పందించారు. ఇందుకు సంబంధించి ప‌క్కా ఆధారాలు చైర్మ‌న్‌కు అందించిన‌ట్టు తెలుస్తోంది. చీర్ల కిర‌ణ్ త‌మ‌వాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు ఆఫ్ ది రికార్డుగా స‌న్నిహితుల వ‌ద్ద అంటున్న‌ట్టు తెలిసింది. మ‌రీ ముఖ్యంగా టీటీడీలో లోటుపాట్ల గురించి క‌రుణాక‌ర‌రెడ్డికి, అలాగే ధ‌ర్మారెడ్డికి చేర‌వేస్తున్న‌ది కూడా అత‌నే అని బీఆర్ నాయుడి అనుమానం. టీటీడీలో స‌మ‌స్య‌ల్ని సృష్టించ‌డం, వాటిని యూనియ‌న్ నాయ‌కుడిగా ప‌రిష్క‌రించే స‌మ‌ర్థ‌త త‌న‌కే వుంద‌ని చెప్పుకోడానికి చాప‌కింద నీరులా చీర్ల కిరణ్‌ కుతంత్రాలు చేస్తున్నారని కూడా బీఆర్‌ నాయుడు మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

ఏది మైనా టీటీడీలో ఛైర్మన్‌కు, ఉన్నతాధికారులకు మధ్య ఆధిపత్య పోరులో టీటీడీ పలుచనవుతోంది. శ్రీవారి ఆలయ ప్రతిష్ట మంటగలుస్తోంది. చీర్ల కిరణ్‌ వంటి ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుపెట్టుకుని టీటీడీ ఉన్నతాధికారులు సాగిస్తున్న వికృత క్రీడ ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

4 Replies to “టార్గెట్ బీఆర్ నాయుడు!”

  1. ఒక కర్నాటక TTD సబ్యుడికి, అదికారికి మద్య వివాదం నడిస్తె, దానికి టార్గెట్ TTD Chairman ఎలా అవుతాడు రా GA!!!

Comments are closed.