రాజధాని అమరావతికి ఎల్లో మీడియా కూడా వెన్నుపోటు పొడిచింది. ఇప్పటికే అమరావతిని టీడీపీ పట్టించుకోవడం మానేసింది. ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజధాని అమరావతిని పట్టుకుని వేలాడితే రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. అందుకే అమరావతి నుంచి అరసవెల్లి వరకూ ప్రారంభమైన రెండో విడత పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ, దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
ఇదిలా వుండగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఆ 29 గ్రామాల్లో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియాలో వార్తలు వచ్చేవి. ఇలా వెయ్యి రోజులకు పైగా అమరావతి ఉద్యమాన్ని ఎల్లో మీడియా నెత్తికెత్తుకుని ఊరేగుతోందన్న విమర్శలు లేకపోలేదు. ఇది ఎల్లో మీడియా సృష్టించిన ఉద్యమమే తప్ప, అమరావతి కోసం రోజుల తరబడి రోడ్ల మీదకు ఎవరూ రాలేదనే విమర్శలను వింటూ వస్తున్నాం.
తాజాగా ఎల్లో మీడియాలో అమరావతి ఉద్యమ ఊసేలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టనట్టుగా, అమరావతి ఉద్యమం గురించి చంద్రబాబు ఆదేశాలు లేకపోవడంతో ఎల్లో మీడియాలో చోటు కరువైంది. టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు, చానళ్లలో అమరావతిపై డిబేట్లు కరువయ్యాయి. ఎన్నికల ముంగిట తమను పట్టించుకోకపోవడంపై అమరావతి రాజధాని ప్రాంత రియల్టర్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకాలం అమరావతిని మోసిన వాళ్లు, ఒక్కసారిగా ఎందుకు పక్కన పడేశారో అర్థం కావడం లేదని అంటున్నారు.
మెయిన్ పేజీల్లో కాకపోయినా, కనీసం జిల్లా సంచికల్లో కూడా అమరావతి ఉద్యమానికి చోటు ఇవ్వడం లేదు. అంటే అమరావతి కోసం ఉద్యమించే వాళ్లు లేరని అర్థం చేసుకోవాలా? అనే ప్రశ్న ఉదయించింది. అమరావతిపై అతి చేసి, చివరికి దాని వల్ల రాజకీయంగా నష్టమే తప్ప, లాభం లేదనుకుని కరివేపాకులా వాడుకుని వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, అమరావతి కృత్రిమ ఉద్యమానికి శాశ్వతంగా సమాధి కట్టే క్రమంలో పట్టించుకోవడం మానేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చివరికి తాము వెన్నుపోటుకు గురయ్యామని గుర్తించలేనంతగా చంద్రబాబు తన మార్క్ రాజకీయం చేశారని రాజధాని అమరావతి గుక్కపట్టి రోదిస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు