ఆయన రెండు డిమాండ్లు నెరవేరతాయా?

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు బడుగు బలహీనవర్గాలను ఆకట్టుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోంది. అందుకే రిజర్వేషన్లను, కుల గణనను నెత్తికెత్తుకుంది. ఇప్పుడు కాంగ్రెసు రాజకీయాలు ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. కులగణన విషయంలో తెలంగాణను మోడల్గా చూపిస్తోంది కాంగ్రెసు పార్టీ. తెలంగాణ కాంగ్రెసు నాయకులు రేవంత్ రెడ్డిని, రాహుల్‌గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రశంసల కుంభవృష్టి కురిపించేస్తున్నారు. జనగణనలో కుల గణన చేయాలని కేంద్రం నిర్ణయించడం రాహుల్ గాంధీ చలవే అంటున్నారు.

సరే…రాహుల్‌గాంధీ రెండు డిమాండ్లు చేస్తున్నాడు. ఒకటి రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచాలంటున్నాడు. రెండు ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలంటున్నాడు. బీజేపీ ప్రభుత్వం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని అప్పుడు ఈ రెండూ అమలు చేస్తామని చెబుతున్నాడు. కాని రిజర్వేషన్లు 50 శాతానికి పెంపు, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు సాధ్యమయ్యే పనేనా? కాంగ్రెసు పార్టీ దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో ఉంది కదా. మరెందుకు చేయలేదు? సాధ్యం కాదు కాబట్టే చేయలేదు.

ఆ సంగతి రాహుల్ గాంధీకి కూడా తెలుసు. కాని అధికారంలోకి రావాలనే తాపత్రయంతో ఈ డిమాండ్లు చేస్తున్నాడు. ప్రభుత్వం నడిపే ఫ్యాక్టరీల్లో, సంస్థలలో రిజర్వేషన్లు ఇష్టానుసారంగా అమలు చేయవచ్చు. కానీ ప్రైవేటు రంగంలో పెట్టుబడి, కష్టం, నైపుణ్యం, ఆటుపోట్లు, అన్నీ వ్యక్తిగతమైనవి. ఏ దేశంలోనైనా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఇతోధిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన లేబర్ పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయవలసిందే. కార్మిక కుటుంబాలకు విద్యా ,వైద్యం, పెన్షన్ ఇత్యాది సౌకర్యాలను ఫ్యాక్టరీల యాజమాన్యం సమకూర్చవలసిందే.

కానీ, మేము పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇచ్చాం కదా, మేము చెప్పిన మావాళ్ళకి మీ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు ఇవ్వాలి అని యాజమాన్యంపై ఒత్తిడి చేసే హక్కు ప్రభుత్వానికి ఉండదు. కర్ణాటక రాష్ట్రంలోని ఫ్యాక్టరీలలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే పనిచేయాలని నిబంధన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య. గతంలో మహారాష్ట్రలో మరాఠీలు మాత్రమే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలి అని హుకుం జారీ చేసిన శివసేన పార్టీని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అమలుకు అసాధ్యమైన ఉచిత హామీలు గుప్పించి, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రయివేట్ రంగంలో నూరు శాతం రిజర్వేషన్లు సి.డి ఉద్యోగాల విషయంలో కన్నడిగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాంగ్రెస్ ప్రభుత్వ ఈ అనాలోచిత నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు నిరసించాయి. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వాస్తవంగా ఇది అమలుకు అసాధ్యమైన పని అని కాంగ్రెసులో ఉండే మేధావులకు తెలుసు. తెలంగాణలోనూ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ రంగంలోనే కాకుండా.. ప్రైవేటు సెక్టార్లలోనూ రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయో అప్పుడే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు.

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఎటువంటి నిబంధన లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక చట్టాన్ని తీసుకురాలేదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకొస్తే.. కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ప్రైవేట్ రంగ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ రంగంపై ప్రభుత్వం అధిక నియంత్రణ పెడితే ముఖ్యంగా పెట్టుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు.

రిజర్వేషన్ల వల్ల కంపెనీల ప్రయోజనాలకు హాని కలిగే ప్రమాదం కూడా ఉందని భావిస్తున్నారు.నిరుద్యోగ సంక్షోభ నివారణకు ప్రైవేట్‌ రంగంలో స్థానిక రిజర్వేషన్లు సరైన పరిష్కారం కాదు. వాస్తవానికి రాష్ట్రాలలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అవి ప్రతిబంధకమవుతాయి. నిరుద్యోగ సంక్షోభ నివారణకు ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు సరైన పరిష్కారం కాదు. వాస్తవానికి రాష్ట్రాలలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అవి ప్రతిబంధకమవుతాయి. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. కాని ఆ పార్టీల నాయకులు నిర్వహిస్తున్న సంస్థల్లోగాని, పరిశ్రమల్లోగాని రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా?

ఇక రాహుల్ గాంధీ మరో డిమాండ్ 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయడం. ఇది కూడా సాధ్యం కాదు. ‘రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి మన దేశ అభివృద్ధికి, తద్వారా బడుగు బలహీన వర్గాలైన వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా మారుతోంది. ఈ అడ్డంకిని తొలగించాలి’ అని రాహుల్ గాంధీ అంటున్నాడు. తాము అధికారంలోకి వస్తే కుల ఆధారిత రిజర్వేషన్లు ఎంత అవసరమైతే అంత ఇస్తామని చెబుతున్నాడు. పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి 69 శాతం రిజర్వేషన్లను (బీసీ–30 శాతం, ఎంబీసీ–20 శాతం, ఎస్సీ–18శాతం, ఎస్టీ–1శాతం) అమలుపరుస్తోంది తమిళనాడు.

దీంతో చాలా రాష్ట్రాలకు ఇప్పుడు తమిళనాడు ఆదర్శంగా మారింది. ఎక్కువ శాతం రిజర్వేషన్లను అమలుపరచటమే కాకుండా వాటిని సర్వోన్నత న్యాయస్థానం సమీక్షకు దూరంగా.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టించటంలో కూడా తమిళనాడు సఫలమైంది. మరాఠాలకు రిజర్వేషన్లను (విద్య–12 శాతం, ఉద్యోగాలు–13శాతం) కల్పించటానికి మహారాష్ట్ర చేసిన ప్రయత్నాలకూ, 2023లో కులగణన జరిపి బిహార్‌ చేపట్టిన చర్యలకూ తమిళ రిజర్వేషన్లే ప్రేరణ. కులగణనకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, వందల కోట్లు ఖర్చుపెట్టి, కులాల జనాభాతో పాటు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వివరాలు సేకరించిన అనంతరం రిజర్వేషన్లను (65శాతం) పెంచుతూ బిహార్‌లో చట్టం చేసినా హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టుకు ఎక్కినా ఊరట దక్కలేదు.

ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10శాతం రిజర్వేషన్లతో.. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన 50శాతం రిజర్వేషన్ల పరిమితికి అడ్డంకి తొలగిపోయిందనే వాదనకూ ఆమోదం లభించలేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచటానికి చాలా రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలకు ఏదో ఒక స్థాయిలో న్యాయస్థానాలు నిలువరించాయి. మహారాష్ట్ర, బిహార్‌తో పాటు రాజస్థాన్‌, హర్యాణ, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి. 1992లో ఇచ్చిన మండల్‌ తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించనంత వరకూ రిజర్వేషన్లను 50 శాతాన్ని దాటించటం సాధ్యం కాదు.

2 Replies to “ఆయన రెండు డిమాండ్లు నెరవేరతాయా?”

  1. రేజర్వేషన్లు లేనివాడు బాగుపడాలంటే ఇక దేశం దాటిపోవాలేమో. ఇలాంటి ఆలోచనలతో రాహుల్ గాంధీ ఎప్పటికి p***u గ మిగిలిపోతాడు

  2. రేజర్వేషన్లు లేనివాడు బాగుపడాలంటే ఇక దేశం దాటిపోవాలేమో. ఇలాంటి ఆలోచనలతో రాహుల్ గాంధీ ఎప్పటికి p***u గ మిగిలిపోతాడు

Comments are closed.