జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిణామాలపై కొందరు కావాలని అసత్య ప్రచారాన్ని చేయిస్తున్నారని అంటున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. తనకూ అధిష్టానానికి దూరం పెరిగినట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, కొందరు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని సుధీర్ రెడ్డి అంటున్నట్టుగా సమాచారం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు పూర్తిగా తనకే ఉన్నాయని, అందులో మరో మాటకు తావు లేదేని, అందుకు సంబంధించి పూర్తి విశ్వాసంతో నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నట్టుగా సుధీర్ రెడ్డి అనుచరవర్గానికి వివరించినట్టుగా సమాచారం.
కొన్నాళ్ల కిందట ఒక టీవీ చానల్ కథనంతో స్థానిక కేడర్ కూడా ఉలికి పడింది. అయితే అది పూర్తిగా పెయిడ్ ప్రచారం అనే విషయం ఆ తర్వాత బయటపడింది. రామసుబ్బారెడ్డి చేరికతో సుధీర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, తిరుగుబాట చేస్తారన్నట్టుగా ఆ వార్తా కథనంలో ప్రచారం చేశారు. రామసుబ్బారెడ్డి చేరిక సహజంగానే సుధీర్ రెడ్డికి నచ్చకపోయి ఉండొచ్చు.
ఎందుకంటే ఎన్నికల సమయంలో జమ్మలమడుగు రాజకీయంలో జరిగింది అంతా ఇంతా కాదు! అటు రామసుబ్బారెడ్డి, ఇటు ఆదినారాయణ రెడ్డి కలిసి పని చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గడానికి వారు చేతులు కలిపారు.
అయితే జమ్మలమడుగు రాజకీయంలో దశాబ్దాలుగా వెళ్లూనుకుపోయిన వాళ్లిద్దరి ఆధిపత్యానికీ సుధీర్ రెడ్డి చెక్ పెట్టగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాలిలో.. సుధీర్ రెడ్డి కష్టానికి బంపర్ ప్రైజ్ తగిలింది. అత్యంత భారీ మెజారిటీ తో ఆయన నెగ్గారు.
వయసులోనూ చిన్నవాడే కావడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత చేరువ కాగలిగాడు సుధీర్ రెడ్డి. ఈ పరిణామాల్లో రామసుబ్బారెడ్డి పార్టీలోకి చేరతానంటూ వర్తమానం పంపడంతో జగన్ కూడా వచ్చే వాళ్లను ఎందుకు వద్దనాలి అనే భావనతో సానుకూలంగా స్పందించారు. అయితే ఎవరు తనవారు అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు అనేది సుధీర్ రెడ్డి మాట.
ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎలాంటి సమయంలో జగన్ తో నిలబడ్డారనే అంశాన్ని ఆయన మరవరు అని, నమ్ముకున్న వాళ్లను వైఎస్ కుటుంబం ఎప్పుడూ అన్యాయం చేయదని సుధీర్ రెడ్డి అనుచవర్గానికి ధీమాగా చెబుతున్నారట.
పార్టీ అధికారంలోకి వచ్చాకా చేరే వారి ఉద్దేశాలను, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన వారికి తేడా ఏమిటో సీఎంకు తెలుసని, ఆయన ఆశీస్పులు తనకే పుష్కలంగా ఉన్నాయని.. జమ్మలమడుగు రాజకీయ భవితవ్యం తనతోనే ఉంటుందని.. వైఎస్ కుటుంబ సహకారంతో అది సాగుతుందని సుధీర్ రెడ్డి అనుచవర్గానికి ధీమాగా చెబుతున్నారట.
ఎంపీ అవినాష్ రెడ్డితోనూ సహృద్భావంగా సాగుతున్నట్టుగా సుధీర్ రెడ్డి చెప్పారట. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో తన పని తను చేస్తున్నట్టుగా సుధీర్ రెడ్డి క్యాడర్ కు వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
'గుడ్ మార్నింగ్ జమ్మలమడుగు' పేరుతో ఈ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో ఏరియాకు, ఒక్కో పల్లెకూ వెళ్లి రచ్చబండ్ల మీద, అరుగుల మీదే కూర్చుంటూ.. స్థానికులతో మాట్లాడుతూ.. అక్కడ సమస్యలను తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే.
ఇలా ప్రజలదకు దగ్గరగా మెలుగుతూ, జగన్ ఆశీస్సులు తనకే ఉన్నాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు