ఆలయాలతో పాటు విగ్రహాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి అనిల్కుమార్ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు.
ఈ నిజం ఎక్కడ బయటపడుతుందోననే నిజం వారిలో కనిపిస్తోందని విమర్శించారు. దీంతో ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తిపోతూ గుంపులు గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
విగ్రహాలు పగులగొట్టినా పర్లేదు కానీ, నిజాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఆలయాలతో పాటు విగ్రహాలపై దాడులన్నీ దురుద్దేశాలతో రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నట్టుగా ఉందని అనిల్ మండిపడ్డారు.
కులమతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ఘటనల్లో టీడీపీ పాత్ర ఉందని చెప్పలేదని, కొన్నింటిలో మాత్రమే ఉందని అనిల్ వివరించారు.
జగన్ ప్రభుత్వం కావాలనుకుంటే లోకేశ్ మీద కేసు పెట్టలేదా? అని అనిల్కుమార్ ప్రశ్నించారు. దురుద్దేశం ఎవరికి ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. మాజీ మంత్రి అఖిలప్రియ కేసులో బాబు నుంచి స్పందనే లేదన్నారు.
తిత్లీ తుఫానులో విగ్రహం దెబ్బ తినడాన్ని ఓ బీజేపీ నేత దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. వాస్తవాలు బయటకు వస్తుంటే నారా వారి నరాల్లో వణుకు పుడుతోందని మంత్రి అనిల్కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
భగవంతుడితో ఆడుకున్న వారెవరూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదని అనిల్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆలయాల్లో, విగ్రహాల ధ్వంసం కేసులో ప్రమేయం ఉన్న వారిని టీడీపీ సస్పెండ్ చేసిందా అని ఆయన ప్రశ్నించారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు