చింత చచ్చినా పులుపు చావనట్టు అనే సామెత చందాన టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి తయారైంది. తానేదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే అనే భ్రాంతి, భావనలో చంద్రబాబు ఉన్నట్టున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బాబు హెచ్చరించే తీరు చూస్తుంటే ... ఇక ఆయన జన్మలో మారరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ చెప్తున్న ఏకగ్రీవాలు ప్రజామోదంతో జరిగేవి కాదన్నారు. దౌర్జన్యాలు , దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలను ఏ మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఖబడ్దార్ అంటూ బాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ను పదేపదే ఖబడ్దార్ అంటూ బాబు హెచ్చరించడం పరిపాటైంది.
తన పాలనలో పదుల సంఖ్యలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పార్టీలోకి చేర్చుకున్న పెద్ద మనిషి కూడా ప్రజాస్వామ్యం అంటూ మాటలు కోటలు దాటేలా మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే శక్తిసామర్థ్యాలు లేకపోయినా, ఇలాంటి హెచ్చరికలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను భయపెట్టాలని చంద్రబాబు కలలు కంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా నాటి ప్రతిపక్ష వైసీపీపై చంద్రబాబు ఇదే విధంగా నోరు పారేసుకున్నారు.
ఇప్పుడు ప్రతి పక్షానికి మారినా, ఆయన మాట తీరులో మాత్రం మార్పు లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ఛీప్ ట్రిక్స్ వదిలేసి పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీతో గట్టిగా తలపడేందుకు తగిన వనరులు సమకూర్చడంపై దృష్టి పెట్టడం మంచిదని టీడీపీ అభ్యర్థులు కోరుతుండడం గమనార్హం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు