ఇబ్బంది లేకుండా ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఏపీ హై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న ప్రతిష్టంభనపై విచారణ జరిపిన హై కోర్టు ధర్మాసనం ఎస్ఈసీ ఇష్ట ప్రకారమే వాటిని నిర్వహించాలని తన తీర్పును ఇచ్చింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియా, ఎన్నికలూ రెండూ ముఖ్యమే అని చెప్పిన హై కోర్టు.. ఎన్నికల నిర్వాహణకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.
దీనిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది వరకూ తను ఇచ్చిన షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరగబోతున్నాయని ప్రకటించారు. వచ్చే నెల ఐదు నుంచి 17వ తేదీల మధ్యన ఎన్నికలు నిర్వహించబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హై కోర్టు సింగిల్ జడ్జి రద్దు చేయగా, ధర్మాసనం తీర్పుతో ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ తెర మీదకు వచ్చింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది.
హైకోర్టు ధర్మాసనం స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెరగడాన్ని ఇక్కడ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలున్నాయి.
కేరళలో ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టే. ఎస్ఈసీ మాత్రం ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ కథలో ఇంకా ఎలాంటి మలుపులుంటాయో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు