సీఎం రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు నేతలు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తిపారేస్తున్నారు. ఆయనకు కీర్తి కిరీటాలు పెడుతున్నారు. భుజకీర్తులు తొడుగుతున్నారు. బిరుదులు ఇస్తున్నారు. దేశానికే హీరో అంటున్నారు. ప్రధాని మోదీకే దారి చూపిన నేత అంటున్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే మోదీ అనుసరిస్తున్నారని అంటున్నారు. కులగణన క్రెడిట్ను పూర్తిగా సొంతం చేసుకోవాలని తాపత్రయపడిపోతున్నారు.
తెలంగాణ ఆచరించింది…కేంద్రం అనుసరిస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేంద్రం ఎప్పుడైతే జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించిందో అప్పటినుంచే రాష్ట్రంలో కులగణన రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కులగణనపైన తెగ వాదులాడుకుంటున్నాయి. కులగణన క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీదేనని కాంగ్రెసు నాయకులు ఊదరగొట్టేస్తున్నారు. ఎప్పుడైతే కేంద్రం కులగణన చేస్తామని ప్రకటించిందో అప్పటినుంచి బీఆర్ఎస్ తన మీడియా ద్వారా రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తోంది.
కాంగ్రెసు ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడక అని తాము మొదటినుంచి చెబుతూనే ఉన్నామని, ఇప్పుడు కేంద్రం కూడా అదే మాట చెబుతోందని ప్రచారం చేస్తోంది. అది కులగణన కాదని, కుల సర్వే అని, దానికి విలువ ఉండదని అంటోంది. 42 శాతం రిజర్వేషన్లు కూడా బుట్టదాఖలా అవుతాయని అంటోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలను వృథాగా ఖర్చు చేసిందని నిందిస్తోంది. బీజేపీ కూడా ఇదే చెబుతోంది. గతంలో బీఆర్ఎస్ చేసిన సర్వేలో ముస్లిం బీసీలను కలిపిన తర్వాత బీసీ జనాభా 51 శాతం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో కేవలం బీసీ జనాభాయే 56 శాతంగా ఉందని మంత్రి కాంగ్రెసు మంత్రులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ చేసిన సర్వే కంటే తాము చేసిన సర్వేలో బీసీ జనాభా పెరిగిందని అన్నారు. గులాబీ పార్టీ సర్వేతో పోలిస్తే తమ కులగణనలో ఓసీల సంఖ్య తగ్గిందన్నారు. కేసీఆర్ హయాంలో సమగ్ర కులగణన రిపోర్ట్ వచ్చినట్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకే తెలియలేదని, ఇక ప్రజలకు ఎలా తెలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకూ కులగణన చేయలేదని, అలాంటి వారు ఇక్కడ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన జరిగిందని మంత్రి చెప్పుకొచ్చారు. కులగణన పూర్తిగా తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఉందని కేటీఆర్ మండిపడ్డాడు.
కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారన్న కేటీఆర్ దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చిత్రీకరించారని అన్నాడు. దీనిపై బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. కులగణన చిత్తు కాగితంలో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారని కేటీఆర్ చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించాడు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన వల్ల రానున్న కాలంలో బీసీల భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం ఉందన్నాడు. కులగణనపై తమతో చర్చకు వస్తామని కాంగ్రెస్ చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నాడు.
తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, వారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన అనంతరం తమతో చర్చలకు రావాలన్నాడు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని, బీసీలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నాడు. దేశవ్యాప్తంగా సామాజిక వర్గాల గణాంకాలు సేకరించాలనే ఒత్తిడి పెరుగుతుండటంతో బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనకు ఆమోదం తెలిపింది. దీన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా చెప్పుకుంటుంటే, కులగణన చేయాలని నిర్ణయించిన బీజేపీ కాంగ్రెస్పై విమర్శలు కురిపించింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ముక్తకంఠంతో కోరుతుండగా, అధికార బీజేపీ ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ కాలయాపన చేసింది. కేంద్రప్రభుత్వం కులగణనకు సుముఖంగా లేకపోవడంతో కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులాలవారీగా లెక్కలు చేపట్టాయి.బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కులగణన నిర్వహించాయి. 2023లో బిహార్లో నితీష్ కుమార్ నిర్వహించిన కులగణనలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నట్లు తేలింది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో చేపట్టిన కులగణన సర్వే 2018 నాటికి పూర్తయినా ప్రభుత్వం మారడంతో పెండింగ్లో పడింది.
2023లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో 2024లో బీసీ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 69.6శాతం బీసీలు ఉన్నట్టు తేలింది. అయితే ప్రభుత్వం అధికారికంగా దీన్ని ఆమోదించలేదు. జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలో కులగణనపై తీర్మానాలు చేసినా నిర్వహించలేదు. తెలంగాణలో కులగణన పూర్తిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనువెంటనే జనాభా ఆధారంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేయడంతో ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్లపై ఒత్తిడి పెరిగింది.
బీజేపీ ప్రభుత్వం ఇంతకాలం కులగణనను విమర్శిస్తూ ఇప్పుడు జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడంతో దేశంలో మళ్లీ రాజకీయ వేడి పుట్టింది. ఇది కాంగ్రెస్ గెలుపుగా ఆ పార్టీ చెప్పుకుంటోంది. కాని గతంలో కాంగ్రెస్ కులగణనను పక్కనపెట్టింది. ఇప్పుడు చేసిన కొన్ని రాష్ట్రాల లెక్కలు కూడా తప్పులతడకంటూ బీజేపీ విమర్శిస్తోంది. గతంలో కులగణన పేరు ఎత్తితేనే ఎగిరిపడే బీజేపీలో ఇప్పుడు మార్పుకు అనేక కారణాలున్నాయి.
కులగణన డిమాండ్ చేసినవారిని అర్బన్ నక్సల్స్ అని, దేశాన్ని కులాల పేరుతో విభజించడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ పలు మార్లు ప్రతిపక్షాలను విమర్శించింది. ప్రస్తుతం బీజేపీ తన నిర్ణయం మార్పుకోవడంలో రాజకీయ కోణాలున్నాయి. ఇంతకుముందే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ఇప్పుడు కులగణనకు ఓకే చెప్పింది. హిందుత్వ రాజకీయాలపై ఆధారపడిన బీజేపీ అధికశాతం ఉన్న బీసీలను దూరం చేసుకుంటే జరిగే నష్టాలను అంచనా వేసుకొని ఇప్పుడు కులగణనపై కీలక నిర్ణయం తీసుకుంది.
హిందుత్వంతో పాటు బీసీలను కూడా ఓటు బ్యాంకుగా మల్చుకొని ఆరునెలల్లో జరగనున్న బిహార్లో లబ్ది పొందాలని, అనంతరం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే సుదీర్ఘ ఆలోచనతో బీజేపీ ఈ పాచికను వేసింది. జనాభా లెక్కలతో కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దేశంలో కులగణనపై ఎవరికివారే పొలిటికల్ గేమ్ ప్రారంభించారు.
Game changer
సెక్యులర్ పార్టీలు చేసే కులగణన కేవలం హిందువులకే. మోడీ చేస్తున్నది ముస్లీమ్ క్రైస్తవవర్గాలకు కూడా.
హిందువులను చీల్చి ముస్లింలను ఏకంచేసి దేశాన్ని ఏలదామనుకున్నవారికి, ముస్లీంకులగణన దెబ్బ ఇప్పుడే తెలియదు