తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామికి పెద్ద చిక్కే వచ్చి పడింది. మొదట్లో ఇది అంతగా పట్టించుకోవల్సిన విషయం కాదులే అని అన్నాడీఎంకేతోపాటు ఇతరులూ అనుకున్నారు. కాని ప్రతిపక్ష డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ పట్టుబట్టి దీనికి పీటముడి వేసి హైకోర్టుకెక్కడంతో పళనిసామి తప్పనిసరిగా జవాబు చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం 'నైతికత'తో ముడిపడి ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయకపోతే సమస్య సుప్రీం కోర్టుకు చేరే అవకాశముంది. ఇంతకే పళనిసామికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? జయలలిత మరణించినప్పటికీ ఆమె ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికీ ఉన్నాయి. జయలలిత తన హయాంలో 'అమ్మ' పేరుతో ప్రవేశపెట్టిన పథకాలు అదే పేరుతో ఇంకా కొనసాగుతున్నాయి. పళనిసామి అధికారం స్వీకరించిన వెంటనే అమ్మ పేరుతో మరో ఐదు పథకాలను ప్రారంభించారు. తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులకు, అభిమానులకు 'అమ్మ' మీద ఉన్న వీరభక్తి తెలియందికాదు. కాబట్టి ఇదంతా సహజమే కదా అనుకోవచ్చు. కాని ఇదంతా 'అసహజం' అంటున్నారు డీఎంకే నేత స్టాలిన్.
అమ్మ ట్యాప్టాప్స్ పేరుతో విద్యార్థులకు ల్యాప్టాప్స్ పంపిణీ చేశారు. చిన్న పిల్లలున్న తల్లులకు అమ్మ బేబీ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందులో పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. పేదల కోసం అమ్మ ఉప్పు ప్యాకెట్లు అమ్ముతున్నారు. మార్కెట్లో కంటే వీటి ఖరీదు చాలా తక్కువ. పేదల కోసం ప్రవేశపెట్టిన మరో పథకం అమ్మ సిమెంట్. దీని ఖరీదు కూడా బాగా తక్కువ. అమ్మ విత్తనాలు, అమ్మ గ్రైండర్లు, అమ్మ ఫ్యాన్లు, అమ్మ ఔషధాలు, అమ్మ మొబైల్ ఫోన్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 'అమ్మ మక్కల్ సేవై మైయ్యం (అమ్మ ప్రజాసేవ కేంద్రాలు) పేరుతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోని మీ సేవ, ఈసేవ కేంద్రాల్లాంటివి. తక్కువ ధరలకు పేదలు సినిమాలు చూసే అవకాశం కల్పించేందుకు 'అమ్మ సినిమా' పేరుతో థియేటర్లు నిర్మిస్తున్నారు. వీటిల్లో టిక్కెట్ల ధరలు పాతిక రూపాయల కంటే తక్కువగా ఉంటాయి. పైగా ఇవన్నీ ఎయిర్ కండిషన్డ్ థియేటర్లు కావడం విశేషం. స్టాలిన్ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తన పేరుతో, బొమ్మలతో ఉచిత పథకాలను అమలు చేయడం జయలలిత స్టయిల్. దీని కారణంగానే ఆమె దశాబ్దాలపాటు పరిపాలించగలిగారు' అని పేర్కొంది. మరి 'అమ్మ' ఫొటోలు, పేరు ఉంటాయో, మాయమవుతాయో చూడాలి.
-నాగ్ మేడేపల్లి
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు