మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?

తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమ పార్టీ పూర్తిగా గాడిదప్పి పోకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీలో ఇప్పటికే పలువురు కాంగ్రెసులో చేరిపోయిన రోజుల్లో- ఉన్నవారినైనా కాపాడుకోవాలని నయానా భయానా…

తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తమ పార్టీ పూర్తిగా గాడిదప్పి పోకుండా చూసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పార్టీలో ఇప్పటికే పలువురు కాంగ్రెసులో చేరిపోయిన రోజుల్లో- ఉన్నవారినైనా కాపాడుకోవాలని నయానా భయానా ఆ టార్గెట్ సాధించాలని ఆయన భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలలో కూడా మరికొందరు కాంగ్రెసులో చేరుతారనే భయం కేటీఆర్ లో కనిపిస్తున్నట్టుగా ఉంది.

గులాబీ దళం నుంచి ఇప్పటికే సుమారు పదిమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి కోర్టులో దావాలు నడుపుతుంది. తమ అధికారంలో ఉన్న రోజుల్లో ఏకంగా 12 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపజేసి.. తమలో కలుపుకున్న వైనం వారు మరచిపోతున్నారు.

అందుకు రకరకాల వంకర సాకులు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీ మారిన వారు మాత్రం తప్పు చేసినట్లే అని వారి మీద అనర్హత వేటు వేయించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. హైకోర్టు పరిధిలో వ్యవహారం తేలకపోతుండేసరికి, ఢిల్లీ వెళ్లి అక్కడి న్యాయ నిపుణులతో కూడా కల్వకుంట్ల తారక రామారావు చర్చలు సాగిస్తున్నారు.

కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్యేలు అందరిమీద తప్పనిసరిగా అనర్హత వేటుపడి తీరుతుందని కచ్చితంగా ఆయా స్థానాలలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ జోస్యం చెబుతున్నారు. మరి వారి మీద అనర్హత వేటు గురించి అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారో తెలియదు. మిగిలిన వారిని భయపెట్టి.. పార్టీ మారకుండా చూడడానికి ఇలాంటి పాట్లు పడుతున్నారంటూ రాజకీయ వర్గాలలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే అనర్హతల వేటు విషయంలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకొని వేటు వేసిన సందర్భాలు తక్కువ. స్పీకర్ విచక్షణాధికారాలలో తాము జోక్యం చేసుకోలేం అని ఇలాంటి కేసులు విషయంలో న్యాయస్థానాలు పేర్కొన్న తీర్పులే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. కేటీఆర్ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే నమ్మకం ఆ పార్టీ వారిలోనే లేదు. అయితే ఆయన పార్టీ మరింతగా శిథిలమైపోకుండా ఉండడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వాదన కూడా వినిపిస్తోంది.

నిజానికి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సాగిస్తున్న చర్చలు మొత్తం ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కాం నుంచి బయటకు తీసుకురావడం గురించి మాత్రమేనని, కనీసం బెయిలు దక్కితే చాలునని ఆరాటపడుతున్నారని వాదన వినిపిస్తోంది.

కాకపోతే ఆర్భాటంగా ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ కు సంబంధించి ఢిల్లీ లెవెల్ లో న్యాయ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారని కూడా కొందరు వాదిస్తున్నారు. మరి కేటీఆర్ చెప్పినట్టుగా ఉప ఎన్నికలు వస్తాయో లేదా గులాబీ దళం మరింతగా ఖాళీ అవుతుందో వేచి చూడాలి!

5 Replies to “మేకపోతు గాంభీర్యమా? కాపాడుకునే ప్రయత్నమా?”

  1. మీగత జనాల సంగతి వదిలేయండి,

    సొంత పార్టీ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ కోసం 4 ఏళ్లు పట్టింది అంటే ,

    ఎంత బాగా కొవ్వు పట్టి వుందో కేసీఆర్, కేటీఆర్ లకి ,

    ఇప్పుడు అర్థం అయింది.

Comments are closed.